మేడ్చల్, డిసెంబర్ 20 : సమాచార, సాంకేతిక నైపుణ్యాలు ఉంటే సరిపోదని, సరైన అవగాహనతోనే విదేశీ విద్య సాధ్యమవుతుందని వై యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన వై-యాక్సిస్ ‘ఓవర్సీస్ ఎడ్యుకేషన్’పై అవగాహన సదస్సులో ఫైజల్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన 90 శాతం మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనే కోరిక ఉంటుందని, అవగాహన లేమితో దేశానికి పరిమితం అవుతున్నారని చెప్పారు. ఏ విధమైన పరీక్షలు ఉంటాయి. వీసా పొందడమెలా, భాషా సమస్యలను ఎలా అధిగమించాలి తదితర విషయాలపై సంపూర్ణ అవగాహన అవసరమని పేర్కొన్నారు. సరైన సమయంలో ప్రక్రియ ప్రారంభించి, డాక్యుమెంటేషన్ పరిపూర్ణంగా ఉంటే తప్పకుండా కోరుకున్న యూనివర్సిటీలో సీటును కైవసం చేసుకోవచ్చని చెప్పారు. ఔత్సాహిక విద్యార్థులు ముందుకొస్తే తోడ్పాటునిస్తామని ఫైజల్ హుస్సేన్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి, ట్రైనింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ డైరెక్టర్ కే వెంకటరమణ, ఈవెంట్ మేనేజర్ గణేశ్ పాల్గొన్నారు.
అవగాహన తప్పనిసరి
విదేశీ విద్యపై అవగాహన తప్పనిసరి. 2017 కంటే ముందు గుడ్ లాంగ్వేజ్, ఇండస్ట్రియల్ నాలెడ్జ్, మంచి మార్కులు ఉంటే సరిపోయేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తమకున్న నైపుణ్యాలకు తగ్గ విద్య, ఉద్యోగం ఎక్కడ లభిస్తుంది. మార్కెట్లో ఉన్న అవకాశాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి అవగాహన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
– వీఎస్కే రెడ్డి, వీసీ, మల్లారెడ్డి యూన్సివరిటీ
ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
సదస్సులో పాల్గొన్నాక 80 శాతం మంది విద్యార్థులు విదేశీ విద్యపై ఆసక్తి చూపుతున్నారు. కెరీర్ అభివృద్ధికి సరైన ప్లానింగ్ అవసరం. ఇలాంటి అవగాహన సదస్సుల ద్వారా ముందస్తు ప్లాన్ చేసుకొని, విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించొచ్చు.
– కే వెంకటరమణ, ట్రైనింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ డైరెక్టర్
నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు
యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు విదేశీ విద్యపై అవగాహన కల్పించిన వై యాక్సిస్ సంస్థ, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు ప్రత్యేక కృతజ్ఞతలు. గ్రామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. కెరీర్ను అభివృద్ధి చేసుకొనే అన్ని అవకాశాలను విద్యార్థులకు కల్పించి, ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కృషి చేస్తున్నాం.
– డాక్టర్ భద్రారెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ, ప్రెసిడెంట్