Amit Shah | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోమంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటనపై బీజేపీ నేతల్లో ఇంకా నమ్మకం కుదరడం లేదు. ‘షా ఈసారైనా వస్తారా’ అని కమలదళం అంతర్మథనం చెందుతున్నది. ఇప్పటికే అమిత్ షా ఒకసారి ఖమ్మం సభకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో తూచ్ అన్నారు. ఈ ఏడాది జూన్లో ఖమ్మంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని, అమిత్ షా హాజరవుతారని బీజేపీ గప్పాలు కొట్టింది. రాష్ట్ర నాయకులు ఖమ్మంలో బసచేసి నాలుగురోజులు హడావుడి చేశారు. చివరికి రెండు రోజుల ముందు సభను రద్దు చేశారు.
‘గుజరాత్లో వరదలు’ అంటూ సంబంధం లేని కారణం చెప్పుకొచ్చారు. వాస్తవానికి అప్పుడు అమిత్ షా రాడని బీజేపీ నేతలకు ముందే తెలుసని, అందుకే సభకు సంబంధించిన కనీస ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈసారి కూడా సభకు ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా.. బీజేపీ రాష్ట్ర నేతల హడావుడి పర్యటనలు తప్ప పెద్దగా ఏర్పాట్లేమీ కనిపించడం లేదని బీజేపీ నేతలే చర్చించుకొంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాది నాలుగుసార్లు పర్యటనను రద్దు చేసుకొన్నారని, ఈ సారి సైతం అలాగే ముఖం చాటేస్తారేమో అని అనుమానంగా ఉన్నదని అంటున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై నెలల్లో అమిత్ షా రాష్ట్ర పర్యటన అంటూ హడావుడి చేసి, రద్దు చేసుకొన్నారని గుర్తు చేస్తున్నారు.
ఖమ్మంలో లక్ష మందితో సభ అంటూ బీజేపీ రాష్ట్ర నేతలు చేస్తున్న హడావుడి చూసి, కిందిస్థాయి నేతలు నవ్వుకొంటున్నారు. సరిగ్గా మూడు నెలల కిందట కూడా ఇదే తరహాలో ప్రచారం చేసుకొన్నారని గుర్తు చేస్తున్నారు. జూన్లో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుతారని రాష్ట్ర నాయకత్వం అమిత్ షా ముందు గప్పాలు కొట్టిందని పేర్కొంటున్నారు. అది జరగకపోవడంతో.. విషయం అమిత్షాకు అర్థమైందని, దీంతో సభకు వచ్చి పరువు పోగొట్టుకోవడం కన్నా.. రద్దు చేయడమే మేలనుకొని రాలేదని అంటున్నారు.
ఉమ్మడి ఖమ్మంలో బీజేపీకి కనీసస్థాయిలో క్యాడర్ లేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ప్రజలను ఆకర్షించగలిగే ఒక్క బలమైన నేత కూడా లేడని అంటున్నారు. ఓ 20 వేల మందిని తీసుకురావడానికే తల ప్రాణం తోకలోకి వస్తున్నదని, అలాంటిది లక్ష మంది అంటే అదెలా సాధ్యమని వారు చేతులెత్తేస్తున్నారు. భారీగా చేరికలు ఉంటాయన్న ప్రచారంపైనా జోకులు వేసుకొంటున్నారు. ఇప్పటికే ఖమ్మంలో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని, కాస్త పేరున్న పొంగులేటి వంటి నేతలు కాంగ్రెస్లోకి వెళ్లిపోయారని గుర్తు చేస్తున్నారు. కంచుకోటలుగా చెప్పుకొనే లెఫ్ట్ పార్టీలకే దిక్కుతోచని పరిస్థితి ఉన్నదని, అలాంటిది చెప్పుకోవడానికైనా నలుగురి బలం లేని బీజేపీలో ఎవరు చేరుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవంలో బతకాలని సూచిస్తున్నారు.