హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడులో బీజేపీ ఓటమి ము మ్మాటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని అమిత్షా 2017 నుంచి విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు. గత రెండేండ్లలో ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకొని దాదాపు నెలకోసారి తెలంగాణలో పర్యటించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పాలనపై అడ్డగోలుగా విమర్శలు చేశారు. రాజగోపాల్రెడ్డికి కాంట్రాక్టు కట్టబెట్టి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించడంలో అమిత్షాది కీలకపాత్ర.
ఉప ఎన్నికలో ప్రజలకు డబ్బు పంచేందుకు రూ.2.5 కోట్లను గుజరాత్ నుంచి హవాలా రూపంలో పంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. చివరి అస్త్రంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సైతం దిగజారారు. ఢిల్లీ నుంచి ముగ్గురు దళారులను పంపి.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయారు. అమిత్ షా నేతృత్వంలోనే ఇదం తా జరుగుతున్నదని స్వయంగా నిందితులే చెప్పుకొచ్చారు. దీనిని బట్టి మునుగోడులో బీజేపీ ఓటమి కచ్చితంగా అమిత్ షా ఓటమేనని విశ్లేషకులు సూటిగా చెప్తున్నారు. ‘చెరపకురా చెడేవు’ అన్నట్టుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ను చెడగొట్టబోయి.. బీజేపీని షా సర్వనాశనం చేశారని అంటున్నారు.
అనుకొన్నదొకటి.. అయిందొకటి
రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి మరీ అవసరం లేని ఉప ఎన్నికను తెచ్చిన బీజేపీ దారుణ పరాభవం చవిచూడాల్సి వచ్చింది. మునుగోడులో రాజగోపాల్రెడ్డిని గెలిపించ డం ద్వారా 2 రకాల ప్రయోజనాలను ఢిల్లీ పెద్దలు ఆశించారు. ఓవైపు రాష్ట్రంలో బీజేపీ పుంజుకొంటుందన్న ఆశ.. మరోవైపు సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ జాతీయ ప్రస్థానానికి మొదట్లోనే బ్రేకులు వేయవచ్చన్న ఆలోచన.. వీటితోపాటు సీఎం కేసీఆర్ను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలని సైతం బీజేపీ నేతలు కలలుగన్నారు. గెలిచేందుకు అన్ని రకాల పన్నాగాలు పన్నారు. చివరికి ముగ్గురు దళారులను పంపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, టీఆర్ఎస్ను మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నించారు. అవేవీ నెరవేరలేదు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. బీజేపీ కలలు కల్లలయ్యాయి. ఈ ఎన్నికలతో బీజేపీ మరింత పరువు తీసుకోగా, టీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగింది.