హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ భయపడుతాయని, అందుకే ఎప్పుడూ ఎంఐఎం పక్షాన నిలబడతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. బీజేపీ ఓటుబ్యాంకుకు భయపడే పార్టీ కాదని చెప్పారు. అమిత్షా మంగళవారం హైదరాబాద్లో పర్యటించారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సోషల్ మీడియా వారియర్లతో సమావేశమయ్యారు.
ఆ తర్వాత ఎల్బీస్టేడియంలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చివరగా ఓ ప్రైవేట్ హోటల్లో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. విభేదాలను పక్కనపెట్టి పనిచేయాలని సూచించారు. ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేలు చేయదని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా 2జీ, కామన్వెల్త్ గేమ్స్ సహా అనేక రంగాల్లో అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ఇది నిజమో కాదో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ పాలనపై విపక్షాలు 50 పైసల అవినీతి ఆరోపణలు కూడా చేయలేవని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో పాకిస్థాన్ నుంచి రోజూ మిలిటెంట్లు మన దేశంలోకి చొరబడేవారని విమర్శించారు. గత పదేండ్లలో రెండు సార్లు దేశంలోకి చొరబడి పేలుళ్లకు పాల్పడితే మన సైన్యం పాకిస్థాన్లోకి చొచ్చుకువెళ్లి బుద్ది చెప్పిందని గుర్తుచేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలోని ఏ ఒక్క పౌరుడికి నష్టం కలగదని చెప్పారు. ఇది పౌరసత్వం ఇచ్చే చట్టమే తప్ప తీసేసే చట్టం కాదని స్పష్టం చేశారు. ఒవైసీ, ఖర్గే కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణాలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టులను ప్రజలకు వివరించాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. మోదీ హయాంలోనే చంద్రుడి దక్షిణ ధృవంపై మనదేశ ల్యాండర్ దిగిందని చెప్పారు. వందేండ్ల స్వతంత్ర దినోత్సవంనాటికి దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థులు, ఇతర నేతలు పాల్గొన్నారు.