హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డిలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఇచ్చిన హామీలకు ఆ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చాయని హైకోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) నియమితులైన సీనియర్ న్యాయవాది డొమినిక్ ఫెర్నాండెజ్ తెలిపారు. సిగాచి ఘటనపై సిట్ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా అమికస్ క్యూరీ తన వాదనలు వినిపిస్తూ.. పేలుడు జరిగిన రోజున బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని, సీఎం కూడా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పరిహారం చెల్లింపులపై ప్రభుత్వంతోపాటు సిగాచి కంపెనీ సైతం వెనకి తగ్గాయని తెలిపారు. ఇచ్చింది రూ.25 లక్షలు మాత్రమేనని చెప్పారు. మిగిలినవి మృతులకు చెందిన ఈఎస్ఐ, పీఎఫ్ తదితర ఖాతాలకు చెందిన మొత్తమని వివరించారు. సిగాచి కంపెనీ బాధిత కుటుంబాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.42 లక్షలు కాగా, ఇచ్చింది కేవలం రూ.25 లక్షలు మాత్రమేనని వివరించారు.
మిగతా పరిహారం కంపెనీయే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సిగాచి కంపెనీ చెప్తున్నదని పేర్కొన్నారు. ఈ వాదనపై స్పందించిన హైకోర్టు.. పంపిణీకి సంబంధించిన వ్యత్యాసాలపై వివరణ ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. చెల్లింపుల వ్యవహారానికి సంబంధించి ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలిని ప్రతివాదులుగా చేర్చి నో టీసులు జారీచేసింది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, సంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికారి సంస్థలు బాధితులకు న్యాయ సహాయం అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది. విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.