CPI to CM KCR | నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టాలనే నిర్ణయం చారిత్రాత్మకమైనదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్కు సిపిఐ తరుపున అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, అణగారిన వర్గాలను అన్ని రంగాలలో భాగస్వామ్యం చేసే విధంగా రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్ పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టాలని భావించడం సముచిత నిర్ణయమన్నారు. రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన ఆర్టికల్ 3 పొందుపరిచిన ఆయన దూరదృష్టికి సరైన నివాళి అని అన్నారు. దీనికి సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ అంబేద్కర్ పేరును పెట్టాలనే డిమాండ్కు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఆదర్శంగా నిలుస్తుందని కూనంనేని అభిప్రాయ పడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయం, హర్షనీయం అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ సచివాలయానికి పేరు పెట్టని విధంగా మన రాష్ట్ర సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు పెట్టడం గొప్ప పరిణామం అని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ను అభినందిస్తున్నట్లు తెలిపారు. అలాగే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి ప్రధాని నరేంద్రమోదీ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరుతున్నానన్నారు.