హైదరాబాద్, జనవరి 25 (నమస్తేతెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, భారత సమాజం ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అన్నిరకాల వివక్షతలకు దూరంగా, దేశ ప్రజలందరూ సమానత్వ భావనతో జీవించాలని ఆకాంక్షించారు. స్వతంత్య్ర దేశంలో స్వయంపాలన అమలులోకి వచ్చి 77 సంవత్సరాలవుతున్నదని గుర్తుచేశారు. ఈ దశలో రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగంలోని ఆర్టికల్-3 కీలక పాత్రను పోషించిందని తెలిపారు. తెలంగాణలో రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.