CM KCR | భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కనబరిచిన దార్శనికతతోనే దళిత గిరిజన బహుజన వర్గాలతోపాటు సకల జనులందరికీ ఆర్థిక,సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమాన న్యాయం అమల్లోకి వచ్చిందని, ఇందుకోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం, అంబేద్కర్ ప్రత్యేక రాష్ట్రాల కోసం, ఆర్టికల్ 3 ని రాజ్యాంగంలో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి పొందుపరిచారని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు, అందరివాడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్రహం, మరో దిక్కు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్థూపం.. వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్ మహానుభావుడు మనలను నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్పూర్తివంతమై దారి చూపుతాడని సీఎం తెలిపారు. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా.. తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు.
దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో, అంబేద్కర్ గారి ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని సీఎం కేసీఆర్ మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా జరుపతలపెట్టిన విగ్రహావిష్కరణ, తర్వాత నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎం కే చంద్రశేఖర్ రావు మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీఎంఓ కార్యదర్శులు భూపాల్ రెడ్డి, స్మితాసబర్వాల్, ఫైనాన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం స్థాపించాలని నిర్ణయం తీసుకున్న నాటినుంచి, కలకాలం నిలిచే విధంగా సాంకేతికంగా, తయారీ పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడాని కనీసం రెండు సంవత్సరాల సమయం తీసుకున్నదని సిఎం గుర్తు చేసుకున్నారు. ఇందుకు పలు దేశాలు ప్రాంతాలు తిరిగి సమాచారాన్ని సేకరించి పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని సిఎం తెలిపారు.
`నీను వూహించినదానికంటే అత్యద్భుతంగా విగ్రహం రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్నవదనంతో నిలుచుని వున్న అంబేద్కరుడు ఒక తాత్విక జ్జానిగా అలరిస్తున్నాడు’ అని సిఎం కేసీఆర్ తన ఆనందం, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విగ్రహ రూపశిల్పి.. 98 ఏండ్ల పద్మభూషణ్, రామ్ వంజీ సుతార్..కృషిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… ‘ దేశం గర్వించదగ్గరీతిలో అందరివాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాశయుని మహా విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నం. ఈ దేశం ప్రజలకోసం భవిష్యతఖ తరాలకోసం రాజ్యంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధునిగా వారు చేసిన కృషి, త్యాగం అజరామరం. కేవలం దళితులు, గిరిజనులు బహుజనులు, భారతదేశ ప్రజలు మాత్రమే కాదు.. వివక్షను ఎదుర్కొనే ప్రతి చోటా అంబేద్కర్ ఆశయం సాక్షాత్కారం అవుతుంది. అంబేద్కర్ మహాశయుడు విశ్వ మానవుడు. వారి కృషి ఒక్కటని చెప్పలేం. వారికి మనం ఎంత చేసుకున్నా తక్కువే. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే వారి అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్పూర్తి పొందడమే’ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే.. రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టుకున్నామన్నారు.
ఇటువంటి చారిత్రాత్మక సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తగు జాగ్రత్తలతో పకడ్బందీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రం నలు మూలలనుంచి విగ్రహావిష్కరణ కోసం వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారికి సీఎం పలు సూచనలు చేశారు.
విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి అభిమానులు సామాజిక వేత్తలు సామాన్యులు వారి సందర్శనకోసం వస్తారని, ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎండాకాలం కావడంతో నీడకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ ఏర్పాట్లన్నీ మరో నెల రోజులు కొనసాగించాలని మంత్రులను, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తాను నాలుగు దశాబ్దాల క్రితమే ఎమ్మెల్యేగా వున్నప్పుడు భారత దేశ దళితుల స్థితి గతులను ప్రపంచంలోని అణగారిన వర్గాలతో పాటు పోల్చేతూ అధ్యయనం చేయాలనే తలంపుతో ‘సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ ’ అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. భారత దేశంలో అంటరాని తనం పేరుతో దుర్మార్గమైన రీతిలో వివక్షకు గురవుతున్న దళితుల అభ్యున్నతికోసం, వారితో పాటు అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాశయుడు పడిన శ్రమ కృషి ఆసియా ఖండం లోనే మరొకరు చేయలేదని సిఎం స్పష్టం చేశారు.
• ఏప్రిల్ 14 న జరిగే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా,కన్నుల పండుగగా దేశం గర్వించే రీతిలో జరపాలి.
• ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత, తెలంగాణ ప్రదాత కు ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించాలి.
• గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించాలి.
• 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికున్న భారీ పరదాను తొలగించడానికి,, నిలువెత్తు పూలమాలను అలంకరించడానికి….అతి పెద్ద క్రేన్ ఉపయోగించాలి.
• ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి వారి సంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమం నిర్వహించాలి.
• ఈ కార్యక్రమానికి.. సచివాలయ సిబ్బంది అధికారులతో పాటు..అన్ని శాఖల హెచ్ వోడీలు, జిల్లా కలెక్టర్లు..రాష్ట్ర మంత్రులు, ఎంపీలు (రాజ్యసభ లోక్ సభ), ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు హాజరుకావాలి.
• ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.
• ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవాలి.
• హైద్రాబాద్ చేరుకునే లోపే 50 కిలోమీటర్ల దూరంలోనే సభకు వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాట్లు చూసుకోవాలి. సభానంతరం తిరిగి వెళ్లేప్పుడు కూడా రాత్రి భోజనం ఏర్పాట్లు చూసుకోవాలి.
• ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు (విజయ డైరీవారి), లక్షన్నర వాటర్ ప్యాకెట్లు అందుబాటులో వుంచాలి.
• పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం వున్నందున, విగ్రహ చుట్టు పక్కల ప్రాంతాన్ని మొత్తం వినియోగించుకోవాలి. ప్రజలకు ఎండవేడి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేయాలి.
• ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ బాధ్యతను హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ తీసుకోవాలి. పార్కింగ్కు అనువైన స్థలాన్ని పరిశీలించాలి.
• సభ రోజు సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్న్యాయ మార్గాలను పోలీస్ యంత్రాంగం చూడాలి.
• హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, డీజీపీ అంజినీ కుమార్, సీపీ సీవీ ఆనంద్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శులు అధికారులు ఏర్పాట్లకు బాధ్యత వహించాలి.
• ఘనమైన రీతిలో ఆట పాటలతో సంబురాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. ఇందుకు గిడ్డంగుల శాఖ చైర్మన్, గాయకుడు సాయిచంద్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కార్యక్రమాలను రూపొందించాలి.
• అంబేద్కర్ పాటలను మాత్రమే పాడుతూ, ఆ మహనీయునికి తెలంగాణ సాంస్కృతిక నీరాజనం అర్పించాలి. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్, తదితర ముందస్తు సన్నద్దత బాధ్యత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీసుకోవాలి.
• డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అధికారిక కార్యక్రమం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని ఏర్పాట్లు స్వయంగా పరిశీలించాలి.
• విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డా బీఆర్ అంబేద్కర్ ముని మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ను ముఖ్య అతిథిని ఆహ్వనించాలని నిర్ణయం.
• మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డిలతో కూడిన కమిటీ ఇందుకు తగు చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు విగ్రహావిష్కరణ, సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
• ఈ సందర్భంగా సభికులకు అనువుగా ఎల్ ఈ డీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలి.
• సభికుల కోసం 40 వేల కుర్చీలను ఏర్పాటు చేయాలి.
• ఎంపిక చేయబడిన ఆహ్వానితులు, సంబంధిత మేధావులు తదితర ప్రముఖుల కోసం పాస్ లు జారీ చేయాలి.
• అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించాలి.
• ఏప్రిల్ 14 మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది.
• ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమౌతుంది. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగిస్తారు. తదుపరి సీఎం కేచంద్రశేఖర్ రావు సందేశం ఉంటుంది. సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా గారి ధన్యవాద ప్రసంగంతో సభ ముగుస్తుంది.