హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నిర్మాణ పనులు ఈ నెల 30లోగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈలోగా అన్ని పనులూ పూర్తిచేయాలని స్పష్టంచేశారు. మంగళవారం మంత్రి ప్రశాంత్రెడ్డి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన విగ్రహంతోపాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమావేశమై రోజువారీ పనుల పురోగతిపై చర్చించారు. పనులన్నీ ఏప్రిల్ 10లోపు పూర్తిచేయాలని సూచించారు.