దళిత జనోద్ధరణ, బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల తమ ప్రేమ గురించి ప్రధాని మోదీ ఘనంగా ఉద్ఘాటిస్తుంటారు. మరి చేతలు? అంబేద్కర్ ఆశయాల అమలు సంగతి పక్కన పెడదాం. కనీసం ఆయన ‘మూర్తి’మత్వాన్ని ఆకాశమంత ఎత్తున నిలపడమూ చేతకాదా?
ముంబైలో శివాజీపార్క్ బీచ్లో అంబేద్కర్ అంతిమ సంస్కారాలు జరిగిన చైత్య భూమిని యాత్రా స్థలంగా మారుస్తామని మోదీ ప్రకటించారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరుతో అక్కడ దేశంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఇందుకు 2015 అక్టోబర్ 11న మోదీ శంకుస్థాపన కూడా చేశారు. అప్పుడు అక్కడున్నది డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వమే. 8 ఏండ్లు గడిచిపోయాయి. ఇంకా పునాదులు పూర్తికాలేదు. మోదీ శంకుస్థాపన చేసిన అంబేద్కర్ విగ్రహనిర్మాణ స్థలి ప్రస్తుత దృశ్యమిది.
ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఇంకా సగం కూడా పూర్తి కాని అంబేద్కర్ విగ్రహం
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడానికి బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగమే ప్రాతిపదిక అని అందుకు కృతజ్ఞతగా హైదరాబాద్లో ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో అంబేద్కర్ జయంతిరోజున ప్రకటించారు. అంటే మోదీ ప్రకటన వెలువడిన ఏడాది తరువాత. కేవలం ఏడేండ్లలోనే 125 అడుగుల విగ్రహాన్ని (భూమికతో కలిపి 175 అడుగులు) ఆకాశమంత ఎత్తునఏర్పాటు చేసి రేపు జాతికి అంకితమివ్వబోతున్నారు. ఎవరు పనిమంతులో.. ఎవరి నిబద్ధత ఎటువంటిదో తెలుసుకోవడానికి ఇది మరొక మచ్చుతునక!
అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలుస్తుంది. అలాగే ఎవరు పనిమంతులో.. ఎవరు కాదో తెలుసుకోవాలంటే వారు చేపట్టిన పనుల్లో ఏ ఒక్కటి చూసినా సరిపోతుంది. ఏడేండ్ల క్రితం రాష్ట్రంలో అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్దేశించుకున్న సమయానికన్నా ముందే 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మృతి వనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం ఆవిష్కరణ కార్యక్రమానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు.
8 ఏండ్ల క్రితం మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కూడా అంబేద్కర్ అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశమైన చైత్యభూమిని తీర్థస్థలంగా మార్చాలని, 350 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఏండ్లు గడుస్తున్నా సగం పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. చిత్తశుద్ధిలేని నాయకత్వం వల్లే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిందన్న విమర్శలను మహారాష్ట్ర ప్రభుత్వం మూటగట్టుకుంటున్నది. ఇప్పటికే అనితర సాధ్యమైన భారీ ప్రాజెక్టులెన్నింటినో అలవోకగా సుసాధ్యం చేసిన కేసీఆర్ ఎక్కడ? ఆరంభశూరత్వం ప్రదర్శించే మహారాష్ట్ర నేతలెక్కడ? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్నది.
ముంబై నగరంలో అరేబియా సముద్రం ఒడ్డున గద్దె నిర్మాణం వరకే పూర్తయిన అంబేద్కర్ విగ్రహం
మహారాష్ట్రలో చైత్యభూమి ఎదురుచూపులు
అంబేద్కర్ మరణానంతరం ముంబై లో శివాజీ పార్కు బీచ్లో ఆయన అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశమైన చైత్య భూమిని తీర్థయాత్రా స్థలంగా మార్చాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే అక్కడి ఇందుమిల్స్ వద్ద స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో 350 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించేందుకు 2015 అక్టోబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వమే ఆనాడు అధికారంలో ఉన్నది. కానీ నిర్మాణ పనులు మాత్రం వెంటనే ప్రారం భం కాలేదు. శంకుస్థాపన చేసిన రెండేండ్ల తర్వాత 2017 వరకు ఏ కాంట్రాక్ట్ ఏజెన్సీకి నిర్మాణ పనులు అప్పగించలేదు. ఆ తర్వాత 2018లో ఓ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ముందు 763 కోట్ల అంచనాలతో 2021 కల్లా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అంచనాలు పెంచి మళ్లీ గడువు పెంచుకుంటూ పోతున్నారు. ఎప్పటికప్పుడు అంచనాలు మారుస్తూ.. గడువులు పెంచుకుంటూ పోతున్నారు తప్ప పనులు మాత్రం చిత్తశుద్ధితో జరగడం లేదంటూ ముంబై పత్రికలన్నీ విమర్శనాత్మక కథనాలు ప్రచురిస్తుండటం గమనార్హం. స్మారక నిర్మాణానికి సంబంధించిన పనులు 50 శాతం లోపే జరిగాయంటూ మహారాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం తన అధికారిక ట్వీట్ అకౌంట్ ద్వారా ఇటీవల తెలియపరిచింది. ఈ విషయమై అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ స్పందిస్తూ.. ఇప్పటికి 27 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ పెదవి విరిచారు. ప్రభుత్వానికి, ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూైర్తె ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందిస్తున్న శిల్పి అనిల్ సుతార్ కూడా విగ్రహ నిర్మాణానికి మరో రెండున్నరేండ్లు సమయం పట్టొచ్చని చెప్పినట్టుగా మరో మనవడు ఆనంద్రాజ్ అంబేద్కర్ తెలియపరిచారు. కడుపులో లేని ప్రేమ కావలించుకుంటే వస్తదా..అని తెలంగాణ సామెత చెప్పినట్టు అంబేద్కర్ ఆశయాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రధాన మంత్రి మోదీ.. ముంబైలో ప్రాజెక్టులను ఎప్పుడో పూర్తి చేసి ఉండేవారని సామాజిక మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతోంది కదా ఎవరు నిజమైన పనిమంతులో..
తెలంగాణలో పూర్తయిన స్మృతివనం
దేశంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పటంతో పాటు స్మృతివనాన్ని తీర్చిదిద్దుతామని 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. చెప్పిన ప్రకారమే ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చకచకా నిర్మాణ పనులు ప్రారంభించింది. అనుకోని విధంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారితో ప్రాజెక్టుకు తాత్కాలికంగా నిలిచిపోయింది. కొవిడ్ ప్రభావం తగ్గిపోవటంతో నిర్మాణ పనుల్లో మళ్లీ వేగం పుంజుకున్నది. 50 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని, దాంతోపాటు మ్యూజియం, అంబేద్కర్ జీవితంలోని ముఖ్య సంఘటనలకు సంబంధించిన ఫొటో గ్యాలరీ సహా 2.93 ఎకరాల్లో పార్క్ పనులను ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని డిజైన్ అసోసియేట్స్కు ప్రభుత్వం అప్పగించింది. రూ. 146.50 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్కు వెంటనే సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో 2021 జూన్ 3న నిర్మాణ ఒప్పందం కుదిరింది. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్, పుణేలోని వంద అడుగుల ఛత్రపతి శివాజీ, బెంగళూరులోని 153 అడుగుల శివుడు, 90 అడుగుల కెంపెగౌడ విగ్రహాలను రూపొందించిన నోయిడా డిజైన్ అసోసియేట్స్కే అంబేద్కర్ విగ్రహ నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాం వన్జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ విగ్రహ నమూనాలను తీర్చిదిద్దారు. విగ్రహం చెక్కుచెదరకుండా ఉండేందుకు ఉక్కుతో విగ్రహాన్ని తీర్చిదిద్ది ఆపై ఇత్తడి తొడుగులను బిగించారు. విగ్రహ నమూనాలను ఢిల్లీలో పోతపోసి హైదరాబాద్కు తరలించారు.
మూడు దశాబ్దాల పాటు విగ్రహం మెరుస్తూ ఉండేలా పాలీయురేతీన్ కోటింగ్ వేశారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం కింద స్మారక భవనాన్ని నిర్మించారు. 2, 476 చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్లమెంట్ తరహాలో స్మారక భవనాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా ధోల్పూర్ లేతగోధుమ, ఎరుపు రంగు ఇసుక రాళ్లను తెప్పించారు. మూడంతస్తుల్లో స్మారక భవనం నిర్మించారు. న భూతో న భవిష్యతి అన్న చందంగా హుందాగా, భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. 2021జూన్లో నిర్మాణ ఒప్పందం కుదిరి.. 2023 ఏప్రిల్ 30కి గడువు నిర్దేశించుకోగా అంతకన్నా ముందే పనులన్నీ పూర్తయ్యి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతికి విగ్రహావిష్కరణ జరుగనున్నది. తాను తలచిన పనికి రూపకల్పన చేసి, కార్యోన్ముఖుడై ఆద్యంతమూ సమీక్షిస్తూ ఆవిష్కరణ ఘట్టం వరకు తీసుకురావటం వెనుక ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి, సంకల్పబలమే.