హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
ఎన్టీఆర్ గార్డెన్లో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణపు పనులను మంత్రి శాసనసభ్యుల బృందంతో కలసి పరిశీలించారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని లిఖించి దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టిన అంబేద్కర్ గౌరవార్ధం సీఎం కేసీఆర్ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నందుకు దళిత వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా దేశ రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి ఆ మహనీయుడి పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబేద్కర్ పేరు కొత్త పార్లమెంట్ భవనానికి పెట్టాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని ఆయన స్వాగతించారు.
అదే సమయంలో బీజేపీకి చెందిన సభ్యుడు రఘునందన్ రావు తీర్మానం సమయంలో బయటకు వెళ్లడంలో అంతరార్థం ఏమిటన్నది ఆపార్టీ రాష్ట్ర నేత బండి సంజయ్ తేల్చి చెప్పాలని మంత్రి కొప్పుల డిమాండ్ చేశారు.