రంగారెడ్డి, అక్టోబర్ 10 : మహనీయులు చూపిన దారి అనుసరణీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని రేఘడిగణపూర్ గ్రామంలో మంగళవారం భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్ నర్సింహులుతో కలిసి విగ్రహాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి దశ, దిశ నిర్దేశం చేశారని, చిన్న రాష్ర్టాల సాధనలో ఆయన పాత్ర కీలకమన్నారు. నేను మీమధ్యలో ఎమ్మెల్యేగా నిలబడడానికి అంబేద్కర్ పెట్టిన భిక్షే కారణమన్నారు. ప్రపంచంలోని దేశాల్లో పవర్ఫుల్ రాజ్యాంగం మనదే అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే, బాబు జగ్జీవన్ రాం రిజర్వేషన్లు పటిష్టం చేసి అందరికీ సమాన హక్కుల సాధకు ఎనలేని కృషి చేశారన్నారు.
సమాజ పరివర్తన కోసం శ్రమించిన మహానీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. అంబేదర్ వ్యక్తి కాదని సమాజానికి ఓ శక్తి అన్నారు. బాబాసాహెబ్ అంబేదర్, బాబు జగ్జీవన్ రాం దళితుల అభ్యున్నతికే కాకుండా, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన మహానీయులు అనిన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి చైర్మన్ పులుమామిడి నారాయణ, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, ఎంపీటీసీ సున్నపు వసంతం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, సర్పంచ్లు మోహన్రెడ్డి, వెంకటయ్య, వెంకటేశం గుప్తా, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.