Ambedkar | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఇక నూతన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరును సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో తెలంగాణ సాహిత్య అకాడమీ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సంయుక్తాధ్వర్యంలో అంబేద్కర్పై కవి సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సమ్మేళనాల్లో పెద్ద ఎత్తున కవులు, రచయితలు పాల్గొన్నారు.
హైదరాబాద్ అశోక్నగర్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కవిసమ్మేళనంలో తెలంగాణా సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ వారసులుగా నేటి యువతరం ఆయన భావజాలాన్ని సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చూసిన ప్రతిసారీ కలిగే స్ఫూర్తి ఆయన తాత్వికతను, ఆలోచనా విధానాన్ని సమాజంలో విస్తృతంగా విస్తరించడానికి తోడ్పడుతుందన్నారు. అంబేద్కర్ సాధించిన విజయాలను గుర్తుచేశారు. కేవలం ఉద్యోగం కోసం చదవకూడదు. జ్ఞానం కోసం చదివినప్పుడే బతుకు బాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం.. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారి, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్, కార్యదర్శి పద్మజా, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ రఘు, అరసం కార్యదర్శి రాపోలు సుదర్శన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ యాకూబ్, తెలంగాణా సాహితీ అధ్యక్షులు ఆనందాచారి, లెక్చరర్స్ ఫోరం సహాధ్యక్షులు అబ్దుల్ షాహెద్, అనంతోజు మోహన్ కృష్ణ, తంగెళ్ళపల్లి కనకాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ కవితలు వినిపించారు. ఈ కార్యక్రమాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన కవులు మొదలు కొత్త తరం కవుల వరకు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న కవులు, రచయితలను జ్ఞాపికలతో సత్కరించారు.