హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి పార్టీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. బీఆర్ఎస్ ఆవిర్భావంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ప్రజా ఎజెండాతో ముందుకెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అండగా ఉంటామని పలు రాష్ర్టాల నేతలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్కు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు అధికారిక ప్రక్రియ పూర్తి కావడంతో పార్టీలో చేరడానికి, పార్టీకి మద్దతు తెలపడానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఆసక్తి కనపరుస్తున్నారు. పార్టీ ఏర్పాటు లక్ష్యాన్ని స్పష్టంగా వివరించిన కేసీఆర్ విధానాలు నచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రముఖ హోదాల్లో రిటైర్ అయిన వ్యక్తులు, ఇలా పలు వర్గాల ప్రజలు పార్టీ ఏర్పాటుపై ఆరా తీస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి, సీఎం కేసీఆర్ కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు పార్టీలో చేరడానికి ముందుకు రాగా మరికొందరు తమ సంఘం మద్దతు పలుకుతుందంటూ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి ఫోన్లు వస్తున్నాయని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ రాష్ర్టాల్లో కూడా అమలు చేయాలని, అది కేసీఆర్ నాయకత్వం ద్వారానే సాధ్యం అవుతుందని విశ్వసిస్తున్నట్టు పలు రాష్ర్టాలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి. అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ పథకాలు ఉంటాయని, వనరులను సద్వినియోగం చేసుకొని దేశాన్ని అగ్రపథాన నిలపడంలో కేసీఆర్కు ఉన్న విజన్ దేశంలో మరేవరికి లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్కు మద్దతుగా వివిధ రాష్ట్రాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ మద్దతును ప్రకటిస్తున్నారు. భారత రాష్ట్ర సమితిని అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే పార్టీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో పెద్దఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ఏపీలోని విజయవాడలోని పలు ప్రముఖ కూడళ్లలో బీఆర్ఎస్కు మద్దతుగా అభిమానులు హోర్డింగ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘దేశ రాజకీయాల్లో నూతన శకం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం’, ‘కక్ష రాజకీయాలకు స్వస్తి’, ‘ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా’ అంటూ నినాదాలతో హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ‘జయహో కేసీఆర్’ అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ల ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని, ఏపీలోనూ బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఆదినారాయణ తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో కూడా కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్కు మద్దతుగా పలువురు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు తరలి రానున్నారు.
ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ శనివారమే బయల్దేరివెళ్లారు. పార్టీ నాయకులు సోమ, మంగళవారాల్లో పెద్దఎత్తున ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీ కార్యాలయాన్ని 14న మధ్య్నాహ్నం 12.30- 1.00 గంట మధ్యన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్టు సమాచారం.