టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వినతి
హుజూరాబాద్, ఆగస్టు 29: రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ కోరారు. ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో క్రీడాకారులు, వాకర్స్తో మాట ముచ్చట నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆ తరువాత పట్టణంలోని 3, 18, 27వ వార్డుల్లో గెల్లు శ్రీనివాస్ ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. శ్రీనివాస్ను వృద్ధులు నిండు మనసుతో ఆశీర్వదించి ఉపఎన్నికలో ఓట్లు వేస్తామని మాటిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదోళ్ల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థించారు. ఆయనవెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్, ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.