బంజారాహిల్స్, మార్చి 12: ఉపముఖ్యమంత్రిగా తాను రాష్ర్టాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్తు, ప్రణాళిక వంటి మూడు శాఖలను నిర్వహిస్తున్నానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అనేక రకాలైన ప్రణాళికల రూపకల్పనలో, విధానపరమైన నిర్ణయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానని తెలిపారు. తాను ఎవ్వరికీ తలవంచే వాడిని కాదని, ఎవ్వరో పక్కన కూర్చొబెడితే కూర్చొనేవాణ్ణి కాదని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం చంపుకునే వాడిని కాదని, ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరిచేవాడిని కూడా కాదని పేర్కొన్నారు. బంజారాహిల్స్లో మంగళవారం నిర్వహించిన సింగరేణి అతిథి గృహ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రిలో చిన్నపీట సంఘటనతో చెలరేగిన దుమారంపై తనకు మద్దతుగా నిలిచిన వారందరికి భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. తాను కింద కూర్చున్న ఫొటోను చూసి చాలామంది మనసు కష్టపడి ఉండొచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహుడికి మొక్కులు చెల్లించడం కోసం కావాలనే తాను చిన్నపీటపై కూర్చొని ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. తననూ ఎవ్వరూ అవమానించలేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ సహృదయంతో యాదాద్రి సంఘటనను అర్థం చేసుకోవాలని కోరారు.
సింగరేణి పరిరక్షణ అందరి బాధ్యత
తెలంగాణకు ఎంతో గర్వకారణమైన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి బంజారాహిల్స్లోని ఎన్బీటీనగర్లో నిర్మించనున్న సింగరేణి అతిథి గృహానికి శంకుస్థాపన చేశారు. ఈయేడు సింగరేణిలో 1900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో గత వారంలో 489 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, మరో 1352 ఉద్యోగాల భర్తీకి అతిత్వరలో నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. 134 ఏండ్ల చరిత్రలో సింగరేణికి హైదరాబాద్లో గెస్ట్హౌస్ లేకపోవడం బాధాకరమని, కార్మికులు, అధికారుల ప్రయోజనార్ధం రాష్ట్ర ప్ర భుత్వం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు.