ఆదిలాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర రైతాంగాన్ని అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారాన్ని వీడాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. రా రైస్ కావాలని మంత్రి అనడం విడ్డూరంగా ఉన్నదని.. గోధుమలకు బదులు పిండిని, పత్తికి బదులు బేళ్లను, కందులు, పెసళ్లకు బదులుగా పప్పులను కొంటున్నారా? అని ప్రశ్నించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారిలో రైతులు పీయూష్ గోయల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన వడ్లను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టంచేశారు. పంటలను సేకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాపార సంస్థగా మారి అదానీ, అంబానీలకు అండగా నిలుస్తున్నదని విమర్శించారు. మార్కెట్లో ఏది అమ్ముడుపోతుందో అదే కొంటామని ఓ వ్యాపారిలా కేంద్ర మంత్రి మాట్లాడారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం విషయంలో కేంద్ర మంత్రులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. వ్యవసాయ చట్టాల పేరుతో 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పాపం కేంద్రంలోని బీజేపీకే దక్కుతుందని స్పష్టంచేశారు.