హైదరాబాద్/కరీంనగర్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) తెలంగాణ నల్లబంగారంగా ప్రతిసిద్ధికెక్కిన సింగరేణిని ప్రైవేటీకరించటంలేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్కో బొగ్గుబ్లాకును క్రమక్రమంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతూ సింగరేణికి ఉరి బిగిస్తూనే.. మా చేతిలో ఏం లేదంటూ అమాయకత్వం ప్రదర్శించారు. ‘సింగరేణిని ప్రైవేటీకరణ చేయం.. అయినా మా చేతిలో ఏమున్నది? సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం. కేంద్రానికి 49 శాతం. ఏం చేయాలనుకొన్నా.. రాష్ట్రం చేతిలోనే ఉంటుంది’ అని శనివారం రామగుండంలో సన్నాయి నొక్కులు నొక్కారు. బయటకు అలాగే కనిపిస్తున్నా.. అంతర్గతంగా సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలు కేంద్రప్రభుత్వం తీవ్రం చేస్తున్నది.
బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేటుకే
సింగరేణి సంస్థ మనుగడ అంతా బొగ్గు తవ్వకంపైనే ఆధారపడి ఉన్నదనేది అందరికీ తెలుసు. బొగ్గు తవ్వాలంటే అందుకు అవసరమైనన్ని బ్లాకులను కేటాయించాల్సి ఉంటుంది. బొగ్గు బ్లాక్లను కేటాయించకుండా, భారీగా ఉత్పత్తి చేయకుండా సింగరేణి ఎలా బతుకుతుంది? ఇప్పుడు సింగరేణి కార్మికులు కూడా అడుతున్న ప్రశ్న ఇదే. వాస్తవానికి గోదావరి పరీవాహక ప్రాంతంలోని బొగ్గు బ్లాకులన్నింటినీ సింగరేణి సంస్థకే కేటాయించాలి. ఎందుకంటే సింగరేణి సంస్థ సుమారు 130 ఏండ్లుగా బొగ్గు తవ్వకాలు చేస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. సంస్థ భవిష్యత్తు మరింత బంగారంలా మారాలంటే మరిన్ని బొగ్గు బ్లాకులను కేటాయించాల్సి ఉంటుంది. కానీ, సింగరేణి గుర్తించి, అభివృద్ధి చేసిన బ్లాకులను కూడా కేంద్రం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతున్నది.
బ్లాకులను కేటాయించేది కేంద్రమే..
సింగరేణి కంపెనీలో 51 శాతం తెలంగాణ రాష్ట్రం వాటా.. 49 శాతం కేంద్రం వాటా ఉన్నది. అందుకే ఏం చేయాలన్నా రాష్ట్రమే చేయాలి. కేంద్రం ఏమీ చేయదని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. వాటాల పరంగా చూస్తే అది నిజమే. కానీ, బొగ్గు బ్లాకులను కేటాయించే అధికారం కేంద్రం చేతిలోనే ఉన్న విషయాన్ని మోదీ దాచిపెట్టారు. మోదీ ప్రధాని అయిన తర్వాత గతంలో ఎన్నడూలేని విధంగా గోదావరి లోయలోని బొగ్గు బ్లాకును ప్రైవేటు కంపెనీకి కేటాయించారు. అంటే.. సింగరేణిలో ఎవరికి ఎంతవాటా ఉన్నది అనేది అసలు విషయమే కాదు. బ్లాకుల కేటాయింపు అధికారం ఎవరికి ఉన్నది? అనేదే అసలు ప్రశ్న. దీనిని ప్రధాని మోదీ కావాలనే దాచి తెలంగాణ ప్రజలను తప్పుదారిపటించే ప్రయత్నం చేశారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
రూ.59 కోట్లకుపైగా ఖర్చుపెట్టిన సింగరేణి
గోదావరి బేసిన్లోని కొత్త బొగ్గు బావులను గుర్తించేందుకు సింగరేణి కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నది. నాలుగు కొత్త బ్లాకుల్లో ఎంత బొగ్గు ఉన్నది? ఎంత లోతులో ఉన్నది? అనే విషయాలు తెలుసుకొనేందుకు సింగరేణి ఇప్పటివరకు రూ.59.04 కోట్లు ఖర్చుచేసింది. వీటిని కేంద్రం తమకే కేటాయిస్తుందనే నమ్మకంతోనే సింగరేణి ఉన్నది. ఇదంతా పట్టించుకోకుండా నాలుగు బ్లాకులకు కేంద్రం వేలానికి పెట్టింది. దీనిని ప్రైవేటీకరణ కాదని ఎలా అంటారు? అని ప్రధానిని సింగరేణి కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వేలంపాట ద్వారానే బొగ్గు బ్లాకులు కేటాయిస్తామని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పార్లమెంటులో లిఖితపూర్వకంగా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నేరుగా కేటాయిస్తామని వెల్లడించారు. అంటే తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి అడిగితే ఇవ్వరు.. వేరేవాళ్లు అడిగితే మాత్రం ఇస్తారు అనేది స్పష్టమవుతున్నది. సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా మళ్లించేందుకే బ్లాకుల ప్రైవేటీకరణ జరుగుతున్నదని అనుమానిస్తున్నారు. సింగరేణిలో మొత్తం 15 బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించినట్టు కార్మిక వర్గాలు చెప్తున్నాయి. వీటన్నింటిని ఒకేసారి వేలం వేస్తే కార్మికుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని భావించిన కేంద్రం, ముందుగా నాలుగు బ్లాకులను వేలానికి ఉంచిందని అంటున్నారు.
ఐటీ ఊసే ఎత్తలేదు
సింగరేణి నుంచి ఏటా రూ.4,300 కోట్ల ఆదాయం కేంద్రం పొందుతున్నది.. ఇందులో ఇన్కంటాక్స్ (ఐటీ) పేరుతో అత్యధిక ఆదాయం కేంద్రం ఖాతాకు చేరుతున్నది. తాము స్వేదం చిందిస్తూ ఐటీ ఎందుకు ఇవ్వాలని కార్మికలోకం కొన్నాళ్లుగా ప్రశ్నిస్తున్నది. కార్మికుల కష్టాలను, వారి న్యాయమైన డిమాండ్ను పరిగణనలోకి తీసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే అసెంబ్లీలో సింగరేణి కార్మికులకు ఐటీ ఎత్తివేయాలని ఏకగ్రీవ తీర్మానంచేసి కేంద్రానికి పంపింది. దానిపై ఇప్పటికీ కేంద్రం స్పందించలేదు. పార్లమెంట్లో ఈ ఆంశాన్ని టీఆర్ఎస్ ఎంపీలు పలుమార్లు లేవనెత్తారు. ఈ అంశంపై ప్రధాని రామగుండం పర్యటనలో స్పందిస్తారని కార్మికులు ఆశించారు. కానీ.. ఆయన దాని ఊసే ఎత్తలేదు. తమ ప్రధాన డిమాండ్ గురించి కనీసం స్పందించకపోవటంపై కార్మికులు మండిపడుతున్నారు. పెన్షన్ విషయాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించకుండా తమను మరోసారి వంచించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో పెన్షన్కు కార్మికుల నుంచి వేతనం బేసిక్పై 3.17 శాతమే రికవరీ చేసేవారు. గత ఏడాది నుంచి 7 శాతం తీసుకొంటున్నారు. అయినా పెన్షన్ నయాపైసా పెంచలేదు.
సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఫలితం శూన్యం
గోదావరి బేసిన్ పరిధిలో ఉన్న సింగరేణి సంస్థ.. ఆ పరిధిలోని బ్లాకులను తమకే కేటాయించాలని కేంద్రానికి ఎప్పటికప్పుడు లేఖ లు రాస్తూనే ఉన్నది. దాదాపు 450.70 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న కళ్యాణఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి బ్లాకులను తమకే కేటాయించాలని ఎప్పటినుంచో కేంద్రానికి లేఖలు రాస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కూడా ఈ విషయమై కేంద్రానికి లేఖ రాశారు. గతంలో ప్రధానిని కలిసినప్పుడు కూడా బొగ్గు బ్లాకులు సింగరేణికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపాలను వేటినీ మోదీ సర్కారు పట్టించుకోలేదు. ఈ నాలుగు బొగ్లు బ్లాకులను వేలానికి పెట్టింది. మీకు కావాలంటే వేలంపాటలో పాల్గొనండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది. అయితే ఇందులో కేవలం కోయగూడెం బ్లాక్-3కి మాత్రమే ఒకే ఒక్క టెండర్ వచ్చింది. మూడునాలుగు సార్లు వేలంవేసిన తరువాత కోయగూడెం బ్లాక్-3కి ఒకే టెండర్ వచ్చినా.. తప్పదని చెబుతూ ప్రైవేటు సంస్థకు అప్పజెపుతున్నది.
అభివృద్ధి లేదా.. అవార్డ్స్ ఎందుకు ఇచ్చారు?
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే, అనేక రంగాల్లో ఉత్తమ ప్రగతి ప్రదర్శించిందంటూ అవార్డులు ఎందుకు ఇచ్చారు. అభివృద్ధి చెందలేదని చెప్తున్న మోదీ, అవార్డులు వెనక్కి తీసుకొంటారా? దేశ జీడీపీ కంటే రాష్ట్ర జీఎస్డీపీ ఎక్కువ. చిన్న రాష్ట్రమైనా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటాన్ని జీర్ణించుకోలేక ప్రధాని మోదీ కుట్ర సాధిస్తున్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణను ఆగం చేయలేరు. బీజేపీకి తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ మద్దతు లభించదు.
-మంత్రి శ్రీనివాస్గౌడ్