CPI | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు కొలిక్కిరావడం లేదు.రాష్ట్రంలో ఏదైనా ఓ స్థానం నుంచి పోటీ చేయాలని సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు వరంగల్ లేదా కరీంనగర్ స్థానాల్లో ఏదైనా ఒకటి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద సీపీఐ రాష్ట్ర నేతలు ప్రతిపాదనలు ఉంచారు. ఆ విషయంలో కాంగ్రెస్ పెద్దలు క్లారిటీ ఇవ్వనేలేదు. అవసరమైతే రాష్ట్రంలోని మొత్తం స్థానాల్లో సీపీఐ బరిలో దిగేందుకే మొగ్గు చూపుతున్నది. అయితే తొలి నుంచి వరంగల్ స్థానం ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తూ వస్తున్నది. తమ అభ్యర్థిని కూడా సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. కానీ పొత్తు విషయమే కాంగ్రెస్ చర్చంచడం లేదని తెలుస్తున్నది. షెడ్యూల్ విడుదలైనా పొత్తుల పై క్లారిటీ లేకపోవడంపై సీపీఐ క్యాడర్లో అయోమయం నెలకొన్నది.
ఒంటరి పోరుకు మొగ్గు?
వరంగల్ స్థానంలో పోటీకి కాంగ్రెస్లో పెద్ద ఎత్తున నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కరీంనగర్ సీటు తమ పార్టీకి ఇవ్వాలని సీపీఐ కోరుతున్నది. ఇప్పటికే సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి ఆ పార్టీ ముఖ్య నేతలతో ఈ విషయమై సమావేశమై చర్చించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తాము బలంగా ఉన్నామని, అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నామని సీపీఐ నేతలు స్వయంగా చెప్తున్నారు. గతంలో హుస్నాబాద్, సిరిసిల్లలో సీపీఐ విజయం సాధించగా, మానకొండూరు నియోజకవర్గంలోనూ బలంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో తాడోపేడో తేల్చుకోవడనికి కమ్యునిస్టులు సిద్ధమవుతున్నారు.