MLA Maheshwar Reddy | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని, క్వింటాలుకు రూ. 2,007తో టెండర్లలో పాల్గొంటే, దానికి ‘యూ’ ట్యాక్స్ కలిపి రూ.2223 కు పెంచారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. మిల్లర్ల నుంచి క్వింటాలుకు అదనంగా రూ.216 డిమాండ్ చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ధాన్యం కొనుగోళ్లలో రూ.800 కోట్ల అవినీతి జరిగిందని పునరుద్ఘాటించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం జనవరి 25న టెండర్ల కోసం కమిటీ వేసిందని, అదే రోజు కమిటీ నిబంధనలను రూపొందించి, అదే రోజు గ్లోబల్ టెండర్లకు ప్రకటన కూడా చేశారని పేర్కొన్నారు. ఒక్క రోజులోనే ఇవన్నీ ఎలా జరిగాయని ప్రశ్నించారు. టెండర్లలో తమవాళ్లు మాత్రమే పాల్గొనేలా ‘జీఎస్టీ రిజిస్ట్రేషన్ హైదరాబాద్’లో ఉండాలంటూ నిబంధన పెట్టారని ఆరోపించారు.
గ్లోబల్ టెండర్లలో పాల్గొనేందుకు హర్యానా, పంజాబ్ తదితర రాష్ర్టాల నుంచి కాంట్రాక్టర్లు వచ్చారని తెలిపారు. ఏప్రిల్ 18న జలసౌధలో జరిగిన సమావేశంలో బగాడియా, గురునానక్ వంటి కంపెనీల ప్రతినిధులు వచ్చి తాము కూడా టెండర్లలో పాల్గొంటామని కోరితే.. ‘నేను కమిషనర్ అనుకుంటున్నావా? డైరెక్టర్ జనరల్ను’ అంటూ ఓ అధికారి బెదిరించాడని ఆరోపించారు. ఏప్రిల్ 18న రైస్ మిల్లర్లతో సమావేశంలో జరిగిన చర్చను బయటపెట్టమంటారా? అని మంత్రి ఉత్తమ్కు సవాల్ విసిరారు. మొత్తంగా వాళ్లకు కావాల్సిన వ్యక్తులకే టెండర్లు ఇచ్చారని పేర్కొన్నారు. ‘యూ’ ట్యాక్స్ వసూలుకు కొందరిని నియమించుకున్నారని తెలిపారు.
మిల్లర్లు బియ్యం ఇస్తామంటే వద్దని, డబ్బులే ఇవ్వాలని అడుగుతున్నారని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు నేరుగా టెండర్లలో పాల్గొనకుండా నిబంధనలు పెట్టి అడ్డుపడ్డారని ఆరోపించారు. మొత్తం 35 లక్షల టన్నులకు (3.5 కోట్ల క్వింటాళ్లకు) టెండర్లు జరిగాయని గుర్తుచేశారు. అధికంగా ఖరారు చేసిన రూ.216 లెక్కన మొత్తం రూ.800 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మే 23 లోపు ధాన్యాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుందని టెండర్ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారని, గురువారం నాటికి 2 శాతం కూడా లిఫ్ట్ చేయలేదని చెప్పారు. కాంట్రాక్టర్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, పైగా అదనపు సమయం ఇస్తామని ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నిల్వ ఉన్న 1.59 లక్షల టన్నుల సన్నరకం వడ్లను క్వింటాలుకు రూ.2,259 చొప్పున ప్రభుత్వం అమ్మిందని గుర్తు చేశారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం, హాస్టల్లలో విద్యార్థుల కోసం అంటూ మళ్లీ రూ.5700కు తిరిగి సన్నబియ్యం ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. 10 శాతం నూక ఉన్న బియ్యం బహిరంగ మార్కెట్లో గరిష్ఠంగా రూ.40 కే దొరుకుతున్నదని, దీనిని బట్టి క్వింటాలుకు రూ.17 అధికంగా చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అప్పుడు అంత తక్కువ ధరకు వడ్లు ఎందుకు అమ్మారని, ఇప్పుడు అధిక ధరతో ఎందుకు కొంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తన ఆరోపణలపై సమాధానం చెప్పలేక మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ముఖం చాటేశారని, పోలీసులకు ఫిర్యాదు చేయించి తనపై కేసు పెట్టించారని మండిపడ్డారు. పూర్తి వాస్తవాలతో చర్చకైనా, సిట్టింగ్ జడ్జితో విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నాని తేల్చి చెప్పారు. ఉత్తమ్కు దమ్ము, ధైర్యం ఉంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. జగ్గారెడ్డికి పౌరసరఫరాల శాఖపై ఏం అవగాహన ఉన్నదని మాట్లాడారో అర్థం కావడం విమర్శించారు.