Indian Railways | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి పాఠశాలలకు ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నది. మరోవైపు ఎన్నికలు కూడా ఉండటంతో రైళ్లలో సీట్లన్నీ 2 నెలల ముందే రిజర్వ్ అయిపోయాయి. దీంతో అత్యవసర పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి బెర్తులు దొరకని పరిస్థితి నెలకొన్నది. వేసవి సెలవులు ముగిసే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. రైళ్లలో 4 నెలల ముందే బెర్తులను రిజర్వు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో ప్లానింగ్ ఉన్నవారు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఫలితంగా బెర్తులన్నీ ఒకట్రెండు రోజుల్లోనే అయిపోతుండటంతో అత్యవసర ప్రయాణాలు పెట్టుకున్నవారికి ఇబ్బందులు తప్పడం లేదు.
స్లీపర్, ఏసీ బస్సుల్లో వెళ్దామనుకుంటే అవి పరిమితంగానే అందుబాటులో ఉంటున్నాయి. సెలవుల్లో ప్రత్యేక రైళ్లను నడిపే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం మరో 10 రైళ్లను అదనంగా నడిపితే గానీ సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. సాధారణంగా సెలవుల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. దీనికి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెరగడంలేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల మధ్య తిరుగుతున్న ఈస్ట్కోస్ట్, గోదావరి, గరీబ్థ్,్ర కోణార్క్, ఫలక్నుమా తదితర ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికుల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. ఇటీవల రెండు వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటికీ వాటిలో 1,120 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో రిజర్వేషన్ తెరవగానే హాట్కేకుల్లా అయిపోతున్నాయి.