KCR | నిర్మల్ అర్బన్ : దేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలిచారని, అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నిర్మల్ పట్టణ శివారులో రూ.5.35 కోట్లతో కొత్తగా నిర్మించిన ఈద్గాను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి మంగళవారం రాత్రి ఆయన ప్రారంభించారు.
నిర్మల్కు చేరుకున్న హోంమంత్రి మహమూద్ అలీ సోఫీనగర్లోని మసీద్ను సందర్శించారు. అనంతరం విశ్రాంతి భవనంలో హోంమంత్రి మహమూద్ అలీకి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్ ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందించారు.
ఈద్గాలో ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మాట్లాడారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి సంక్షేమం తెలంగాణలో సాక్షాత్కరమవుతున్నదన్నారు. అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తూ, సీఎం కేసీఆర్ పాలననందిస్తున్నారని కొనియాడారు. రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు అడ్డుకునేందుకు కుట్రలకు తెరతీశాయని మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎంతో గణనీయ మార్పు సాధించిందని స్పష్టం చేశారు. కేంద్రం అందిస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనమని మహముద్ అలీ చెప్పారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నిర్మల్లో పదెకరాల్లో ఈద్గా నిర్మించామని, హైదరాబాద్లో కూడా ఇలాంటిది లేదన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, నక్సలిజం పూర్తిగా అంతమైందన్నారు. దేశంలోని మిగతా రాష్ర్టాలు కూడా తెలంగాణ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నాయని, అందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. కాగా, నిర్మల్ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 5 లక్షల చెక్కును మహమూద్ అలీ మంగళవారం ఫారెస్ట్ అతిథి గృహంలో జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్కు అందజేశారు.