సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 7 : స్వచ్ఛ, ఆరోగ్య సిద్దిపేటకు ప్రజలందరూ సహకరించాలి. నిత్యం అరగంట నడవడంతో పాటు, యోగా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని.. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
బుధవారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట అర్బన్ మండలంలోని 137 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధితో సిద్దిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
ప్రతి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సీఎం కేసీఆర్ లక్షా 116 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఆడపిల్ల పెండ్లికి ఎలాంటి సహాయం చేయలేదని మంత్రి విమర్శించారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా 10 కిలోల బియ్యం అందిస్తుం దన్నారు. మీ కుటుంబ పెద్దగా.. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపన అని.. కర్రీస్ పాయింట్లలో గానీ మరేదైన కానీ ప్లాస్టిక్ కవర్ల ద్వారా క్యాన్సర్ వ్యాధి బారిన పడవద్దని ప్రజలకు మంత్రి హరీశ్రావు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కౌన్సిలర్లు అడ్డగట్ల కావేరి, భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు మోయిజ్, బందారం రాజు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.