Etamatam | ఎన్నికలలో ఇంతవరకు మనం మిత్ర పక్షకూటమి, వామపక్ష కూటమి, మహాకూటమిల గురించే విన్నాం. కానీ ఈసారి మరో కూటమి తెరపైకి వచ్చింది. అదే లోపాయికారీ కూటమి. అధికారికంగా ప్రకటించకుండా మద్దతు పలకడాన్ని లోపాయికారీ కూటమిగా చెప్పుకోవచ్చు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), తెలంగాణ ఇంటి పార్టీ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి. ప్రస్తుతం అలాంటి కూటమి ఏదీ బయటికి కనిపించనప్పటికీ కాంగ్రెస్తో ఒక్క సీపీఐ మాత్రమే అధికారికంగా పొత్తు పెట్టుకున్నది. మరోవైపు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తాము పోటీకి దూరం అని ప్రకటించిన టీడీపీ, లోపాయికారీగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకంగా టీడీపీ కండువాలు కప్పుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగతా చోట్ల కండువాలు కప్పుకోకపోయినప్పటికీ వారికి మద్దతుగా స్థానిక టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాగా తమకు కాంగ్రెస్తో ఎలాంటి పొత్తు లేదని సీపీఎం ప్రకటించినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులకు సీపీఐ మద్దతు ప్రకటించింది. అలాగే సీపీఐ బరిలో లేని చోట బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్కు మద్దతు ఇస్తామనీ పేర్కొన్నది. తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల నాటి మహాకూటమిలోని పార్టీలన్నీ ఈసారి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాంగ్రెస్కే మద్దతు పలుకుతుండగా, అదనంగా సీపీఎం కూడా పరోక్ష మద్దతు ప్రకటించింది. అనధికారికంగా జతకట్టిన లోపాయికారీ కూటమిని బీఆర్ఎస్ సింగిల్గా ఎదుర్కొంటున్నది.