ములుగు : రాష్ట్రంలో శాంతి భద్రతల మెరుగునకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ మొదలవకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగురు) మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతమైన అలుబాక బేస్ క్యాంపును ఆయన సందర్శించారు. అక్కడ పోలీస్ అధికారులతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి మావోయిస్టులు చొరబడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ తోనే రాష్ట్రంలో అభివృద్ధిజరుగుతుందన్నారు. నేర నివారణ లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నారు. శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని దీని ద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
దీని ద్వారా రాష్ట్ర సంపద పెరిగి ప్రజల జీవన స్థితి గతులు పెరుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, కావలసిన వనరులు సమీకరిస్తున్నారని వెల్లడించారు.