హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) అడ్డుకొంటామని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత అధ్యక్షుడు వీపీ సాను చెప్పారు. విద్యను ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ఎన్ఈపీని తెచ్చిందని మండిపడ్డారు. 17వ ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు శుక్రవారం ముగియగా, సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో సాను మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలు, మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు, ఇతర అంశాలకు సంబంధించి 36 తీర్మానాలను మహాసభ ఆమోదించిందని వివరించారు.
కొఠారీ కమిషన్ సిఫార్సుల ప్రకారం విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా వర్సిటీలో జాతీయ మహాసభలకు అవకాశం కల్పించిన వీసీ, రిజిస్ట్రార్కు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.