సూర్యాపేట బొడ్రాయి బజార్, సెప్టెంబర్ 24: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా విభాగం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం దావాలే మండిపడ్డారు. శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన ఐద్వా రాష్ట్ర మూడో మహాసభలో ఆమె మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజాజీవితం రోజురోజుకూ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఏడేండ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫమైందని దుయ్యబట్టారు. ఉజ్వల్ గ్యాస్ ఉచితంగా అందిస్తామ ని ప్రకటించి గ్యాస్ ధరలను పెంచుతూ సా మాన్యుల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. గ్యాస్ సబ్సిడీని కూడా ఎత్తి వేయడం దారుణమని, ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేషాలను పెంచి పోషిస్తూ దేశ ఐక్యతకు భంగం కలిగిస్తుందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో 10 నెలలుగా రైతులు నిరసన తెలుపుతున్నా పట్టించుకోవట్లేదని గుర్తుచేశారు. రైతు కూలీల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహిళా లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.