సారపాక, డిసెంబర్ 28: గురుకులాల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ రోనాల్డ్రోస్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మణుగూరు గురుకుల డిగ్రీ కళాశాలను ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్తో కలిసి బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు సరఫరా చేయడంతోపాటు వారికి అవసరమైన కంప్యూటర్, ల్యాబ్, ఇతర వస్తువులు అందిస్తామని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడిని తట్టుకొని, క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.