బతుకుదెరువు కరువైన కష్టమోడు పేదలార,
గిట్టుబాటు కాక తల్లడిల్లు రైతులార
దిక్కుమొక్కు లేని బాధాసర్ప దష్టులార
ఈ సంరంభం మీదే, ఈ సమరం మీ కోసమే..
సమస్త వృత్తుల సకల వికల ఆర్త జన సోదరులారా!
వస్తున్నది, వస్తున్నది.. మీ కోసం తరలి వస్తున్నది..
బీఆర్ఎస్ ప్రగతి సైన్యం
స్తంభాద్రి వేదికగా పూరిస్తున్నది పాంచజన్య సమర శంఖం..
వింధ్యాచలం వింటున్నది. హిమాచలం కంటున్నది
ఆర్యావర్తమంతా అవధరిస్తున్నది.. భరత ఖండమంతా వినిపిస్తున్నది
తెలంగాణ ధ్వని.. బీఆర్ఎస్ ప్రతి ధ్వనిస్తున్నది
బీఆర్ఎస్ జన రథం, ఇది పేదల మనోరథం
దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా నేడు ఆవిష్కృతమవుతున్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి ఆరంభమవుతున్నది.
మొక్కవోని దీక్షతో తెలంగాణ సాధించిన కేసీఆర్, పరిపాలకుడిగా తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన తీరు దేశానికే ఆదర్శంగా మారింది. తెలంగాణ నమూనా ప్రాతిపదికగా దేశానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను కేసీఆర్ ప్రతిపాదించారు. రైతు సంక్షేమాన్ని ప్రధాన స్రవంతి రాజకీయంగా మార్చడం కేసీఆర్ ఘనత. ఈ ప్రత్యామ్నాయ ప్రజా సంక్షేమ ప్రణాళికే ఊపిరిగా బీఆర్ఎస్ పురుడు పోసుకున్నది.
దేశంలో ప్రతిపక్ష ఐక్య పోరాటానికి కేసీఆర్ కేంద్ర బిందువుగా నిలిచారనడానికి బీఆర్ఎస్ ఆరంభ సభనే ఒక సూచిక. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టించనుండగా, ఆ భూకంప కేంద్రం ఖమ్మం సభ కానున్నది. నలుగురు ముఖ్యమంత్రులు సభలో పాల్గొననుండగా, పలువురు జాతీయ నేతలు బీఆర్ఎస్కు సంఘీభావం తెలుపనున్నారు.
రాష్ర్టానికి చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులకు హైదరాబాద్ ఆత్మీయ స్వాగతం పలికింది. సీఎం కేసీఆర్తో కలిసి నేడు యాదగిరి గుట్టను దర్శించుకొని వారంతా ఖమ్మం సభ వైపు సాగనున్నారు. చారిత్రక సందర్భానికి వేదికకానున్న స్తంభాద్రి.. ఆ అపూర్వ క్షణాల కోసం ఉద్వేగంగా ఎదురుచూస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ నుంచి ఏం ప్రకటన చేయనున్నారోనని జాతీయ పార్టీలు, మీడియా ఆసక్తిగా గమనిస్తున్నాయి.