హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ ఈ మార్చిలోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్ లోని తన చాంబర్ నుంచి, ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డిఆర్డిఓ, డిపిఓ, ఎంపిడీఓలు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి పారిశుద్ధ్యంపై రాజీ లేకుండా, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా, ఉధృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్యాన్ని కొనసాగించాలని, గత కరోనా సీజన్లో పంచాయతీ సిబ్బంది, అధికారుల పనితీరు అద్భుతంగా ఉందని, ఆ ఫ్రంట్ వారియర్ స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి సూచించారు.
మొదటి విడత వ్యాక్సినేషన్లో రాష్ట్రం వందకు వంద శాతం సక్సెస్ సాధించిందని, రెండో విడత కూడా పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి రోజూ గ్రామ కార్యదర్శులు 7 గంటల కల్లా విధుల్లో ఉండాలని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేబర్ మొబిలైజేషన్, కొత్త కార్డుల జారీ అంశాలను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.
కరోనా నేపథ్యంలో నగరాల ప్రజలు పల్లెబాట పడుతున్నారని అలాంటి వాళ్ళందరికీ ఉపాధి లభించేలా చూడటం మన బాధ్యత అని మంత్రి అన్నారు. బంగారు తెలంగాణలో భాగంగా మనం, ఆదర్శవంతమైన పల్లెలను నిర్మించే పనిని మరింత శ్రద్ధతో నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు.