పెద్దపల్లి టౌన్, ఫిబ్రవరి 7: అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) (సీపీఐ అనుబంధం) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు దీక్ష చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సదానందం దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు దళితబంధు పథకాన్ని కొనసాగించాలని కోరారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి జయంతి రోజైన బుధవారం దళితులంతా ఐక్యంగా దీక్ష చేశారని సదానందం గుర్తుచేశారు.