హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఎల్ఐసీ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ క్లాస్వన్ ఆఫీసర్స్ ఫెడరేషన్, ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్తాధ్వర్యంలో మంగళవారం దేశవ్యాప్త నిరసనలో భాగంగా హైదరాబాద్లోని ఎల్ఐసీ కార్యాలయాల ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో మిశ్రా మాట్లాడుతూ ఎల్ఐసీ ఉద్యోగుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ సమర్పించినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 30 శాతం కుటుంబ పింఛన్ను పెంచవచ్చని ఎల్ఐసీ యాజమాన్యం కేంద్రానికి నివేదిక ఇచ్చినా అమలు చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
యాజమాన్యం ఎన్పీఎస్లో10 నుంచి 14 శాతానికి కాంట్రిబ్యూషన్ పెంచాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ కోసం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ తాము నిరసనకు దిగినట్టు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య తెలిపారు.