BRS | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 27: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికార పార్టీ చేస్తు న్న కుట్రలను ప్రతిపక్ష బీఆర్ఎస్ సమర్థంగా అడ్డుకుంటున్నది. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పెడుతున్న అవిశ్వాస తీర్మానాలు వీగిపోతున్నాయి. బీఆర్ఎస్ పాలనపైనే ప్రజాప్రతినిధులు విశ్వాసం చూపుతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్రావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోగా, తాజాగా సూర్యాపేటతోపాటు ఆలేరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్కు ఆశాభంగమే అయ్యింది.
సూర్యాపేట మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకోవాలన్న కాంగ్రెస్ పాచికలు పారలేదు. బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. కాంగ్రెస్ ఎత్తులను సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి చిత్తు చేశారు. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కలిసి ఆవిశ్వాసానికి కావాల్సిన 32 మందితో నోటీసు ఇచ్చారు. సదరు కౌన్సిలర్లను నల్లగొండ జిల్లాకు చెంది న ఓ ఎమ్మెల్యే పర్యవేక్షణలో హైదరాబాద్, గోవాతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో 17 రోజులపాటు క్యాంపుల్లో ఉంచారు. ఎమ్మెల్యే జగదీశ్రెడ్డితో కలిపి బీఆర్ఎస్కు 16 మంది ఉన్నారు. విపక్ష క్యాంపులో ఉన్న ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు రెండ్రోజుల ముందు అవిశ్వాసానికి దూరంగా ఉంటామని ప్రకటించి, కనిపించకుండా పోయారు. వారికి హైదరాబాద్లో సీఎం చాంబర్ కేంద్రంగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినట్టు సమాచారం. శనివారం మున్సిపల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఒక్కరూ హాజరుకాలేదు. కాంగ్రెస్ శిబి రానికి చెందిన ఓ కౌన్సిలర్ బీఆర్ఎస్ వైపు వచ్చినట్టు తెలిసింది. దీంతో మిగిలిన 31 మంది హాజరైనా ఫలితం ఉండదని భావించి రాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు అధికారులు ప్రకటించారు. యాదాద్రి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్యపై 8 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టగా శనివారం ఆర్డీవో అమరేందర్ సమావేశం నిర్వహించారు. 12 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే సమావేశానికి హాజరవడంతో అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ, మహబూబ్నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కుట్రలు చేసి అవిశ్వాస తీర్మానాలను నెగ్గించుకున్నది.
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అవిశ్వాసానికి సమయం ముగియడంతో పాత సొసైటీనే కొనసాగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. సహకార సంఘానికి 13 మంది డైరెక్టర్లు ఉండగా.. ఎనిమిది మంది బీఆర్ఎస్, ఐదుగురు కాంగ్రెస్. వారం కిందట అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవిశ్వాసానికి కాల వ్యవధిని డీసీవో పాత్యానాయక్ నిర్ణయించారు. గడువులోగా ఎవరూ రాకపోవడంతో అవిశ్వాసం వీగిందని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సంబురాల్లో మునిగిపోయారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వీ వెంకటాయపాలెం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కూరాకుల నాగభూషణంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా..11 మంది (మొత్తం 13 మంది) డైరెక్టర్లు హాజరై తీర్మానానికి మద్దతు తెలిపారు. కాగా, డీసీవో విజయకుమారి ఫలితాన్ని ప్రకటించలేదు. నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు తెలిపారు. ఈ నెల 30న ఫలితం వెల్లడికానున్నట్టు తెలిపారు.