Akbaruddin Owaisi | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘ఇవేం లెక్కలు, ఏది కరెక్ట్.. శ్వేతపత్రంలో అన్నీ తప్పులే. ఒకే రకమైన లెక్కలు ఒక్కో పేజీలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఈ బుక్కును మేము న మ్మాలా? అసలు ఈ శ్వేతపత్రం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బుధవారం గత ప్రభుత్వ ఆర్థిక అంశాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అక్బర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్వేతపత్రంలోని తప్పులను ఎండగట్టారు. నమ్మశక్యంగా లేద ని, రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయొద్దని, శ్వే తపత్రం ఉద్దేశమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘గత ప్రభుత్వం నిధుల వినియోగంలో అసమర్థంగా వ్యవహరించిందని ఆరోపించదలచుకున్నారా? లేక ఈ పత్రం ద్వారా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారా? లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు కాబట్టి తాము ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీలు సహా ఇతర వాగ్దానాలను అమలు చేయ డం సాధ్యం కాదని చెప్పదలచుకున్నారా? ఈ శ్వేతపత్రం వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు తెలియకుండా దీనిపై చర్చించడం వ్యర్థం’ అని చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశం ఏమైనా.. తెలంగాణ దివాళా తీసిందని, అ ప్పుల పాలైందని, రాష్ట్రం వద్ద రోజువారీ ఖర్చులకు నిధులు లేవన్న సందేశం ఇవ్వకూడదని చెప్పారు.
శ్వేతపత్రంలోని లెక్కలకు కాగ్, ఆర్బీఐ, బడ్జెట్ లెక్కలకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు. కాగ్, ఆర్బీఐ, రాష్ట్ర బడ్జెట్ లెక్కల పత్రాలను చూపు తూ.. ఒక్కో పేజీ నంబర్, టేబుల్ నంబర్తో సహా తప్పులను ఎత్తిచూపారు. వీటిలో తాము ఏది ఫాలో కావాలని ప్రశ్నించారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి ఇంకా 1.11 లక్షల కోట్లు రావాల్సి ఉన్నదని, ఈ విషయం శ్వేతపత్రంలో ఎక్కడ వెతికినా దొరకలేదని చెప్పారు. శ్వేతపత్రంలో లెక్కలు తప్పని తేలితే.. ఈ లెక్కలు అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయొద్దని అక్బరుద్దీన్ సూచించారు. రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ ప్రచారం చేసి.. ఒక బీమారీ రాష్ట్రంగా చూపించొద్దని కోరారు. దేశానికి, ప్రపంచానికి రాష్ట్రంపై తప్పుడు మెసేజ్ వెళితే అది తీరని నష్టం చేస్తుందని హెచ్చరించారు. 1956 నుంచి బడ్జెట్ లెక్కలు తీయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అప్పటి లెక్కలకు తెలంగాణకు సంబంధం ఏమిటని నిలదీశారు. అయినప్పటికీ 1956 నుంచి 2014 వరకు రాష్ట్ర బడ్జెట్ 11 లక్షల కోట్లు అయితే.. 2014 నుంచి 2023 వరకు పదేండ్లలోనే రాష్ట్ర బడ్జెట్ 12 లక్షల కోట్లకు చేరినట్టు శ్వేతపత్రం లెక్కలే చెబుతున్నాయని, అంటే తెలంగాణ అభివృద్ధి పథంలో ఉన్నట్లే కదా అని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం అప్పులు చేసిందని, అదే సమయంలో అభివృద్ది కూడా చేసిందని అక్బరుద్దీన్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే అమలు చేయాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ఇందులో ఎలాంటి షరతులు, పరిమితులు పెట్టకుండా అందరికీ అమలు చేయాలని అన్నారు.