Strike Notice | కొత్తగూడెం సింగరేణి/ రుద్రంపూర్/గోదావరిఖని, జూన్ 8 : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సమ్మె నోటీసు జారీ చేసింది.
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం, ఇతర సమస్యలను పరిష్కరించకపోవడంతో విసిగివేసారిన గుర్తింపు సంఘం.. చివరకు సమ్మె చేయడం తప్ప మరో మార్గం లేదని సోమవారం కొత్తగూడెంలో జీఎం (పర్సనల్) కవితా నాయుడికి సమ్మె నోటీసు అందజేసింది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ మాట్లాడుతూ… కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దాదాపు 30 డిమాండ్ల పరిష్కారానికి ఏఐటీయూసీ.. సింగరేణి యాజమాన్యానికి అధికారికంగా సమ్మె నోటీసు అందజేసినట్టు తెలిపారు. ఈ నెలాఖరుకల్లా సమస్యలు పరిష్కరించకపోతే జూలైలో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.
సింగరేణి కార్మికుల జీవితాలతో ఆడుకునే వారు మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, అధికారులు ఎవరైనా సరే తమకు శత్రువులేనని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట యూనియన్ నేత కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
స్ట్రక్చర్డ్ మీటింగ్లో ఒప్పుకొన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా, గుర్తింపు సంఘానికి కనీస గౌరవం ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి సంస్థ ప్రభుత్వానికి బంగారు గుడ్లు పెట్టే బాతులా ఉపయోగపడుతున్నదని మండిపడ్డారు. సర్కార్ సింగరేణి ఆదాయాన్ని దోచుకుంటూ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. సింగరేణి 2040 నాటికి మూతపడుతుందని దుష్ప్రచారం చేస్తూ సంస్థను మూసివేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటివరకు ఒక కొత్త గనిని ప్రారంభించకపోవడం, బొగ్గు నాణ్యత లేదనే సాకుతో గనులను మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కారుణ్య నియామకాలు, సింగరేణి లాభాల వాటాపై యాజమాన్యం శ్వేతపత్రం విడుదల చేయాలని, సింగరేణికి రూ.50 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.