Imphal | హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): మణిపూర్లోని ఇంఫాల్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వచ్చేపోయే విమానాల తాకిడిని తట్టుకోలేక ఎయిర్పోర్టు సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో తెలంగాణ పౌరులను క్షేమంగా హైదరాబాద్కు చేర్చే ప్రక్రియ కొంత జాప్యమవుతున్నది. మణిపూర్లో కొనసాగుతున్న అల్లర్ల కారణంగా తమ పౌరులను సురక్షితంగా తరలించేందుకు అన్ని రాష్ట్రాల నుంచి వినతులు వెళ్లాయి. అయితే, ఇంఫాల్ విమానాశ్రయం చిన్నది కావడం, అల్లర్ల కారణంగా కొందరు సిబ్బంది సెలవులు పెట్టడం, ఒక్కసారిగా ఎయిర్ ట్రాఫిక్ పెరగడంతో అక్కడి సిబ్బంది తమ వల్లకాదని తేల్చి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో అందుబాటులో ఉన్న ఆయా రాష్ట్రాల పౌరుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఆయా విమానాలు బయల్దేరేందుకు అనుమతినిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌరులను తరలించే ప్రక్రియ ఆలస్యమైంది.
సీఎస్, డీజీపీతో సమన్వయం
తెలంగాణ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లలో భాగంగా మణిపూర్ అధికారులతో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ చర్చిస్తున్నారు. ఆదివారం కూడా మణిపూర్ సీఎస్తో శాంతికుమారి మాట్లాడి విమానాల ఆలస్యానికి కారణాలను వాకబుచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఎయిర్ ట్రాఫిక్ క్లియర్ అయితే సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానానికి ఎగిరేందుకు సిగ్నల్ ఇస్తామని మొదట సమాచారం అందించారు. ఒకానొక దశలో మణిపూర్లోని తెలంగాణ పౌరులను కోల్కతా మీదుగా హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే, సోమవారం తెలంగాణ విమానానికి అనుమతి ఇస్తామని తెలుపడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చొరవతో ఎయిర్పోర్టుకు వచ్చిన కొందరు పౌరులకు వసతి, భోజన ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.
మణిపూర్ నుంచి తిరిగొచ్చిన ఖమ్మం విద్యార్థి
మణిపూర్లోని ఎన్ఐటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఖమ్మం జిల్లా రాంనగర్తండాకు చెందిన హర్షవర్ధన్ ఆదివారం ఇంఫాల్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణభవన్కు చెందిన సిబ్బంది ఆ విద్యార్థిని విమానాశ్రయం నుంచి భవన్కు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం ఖమ్మంకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మణిపూర్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.