హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజక్టు కోసం ఖర్చుపెట్టిన నిధులకు సంబంధించి శ్వేతపత్రంలో పేర్కొన్న అంకెలకు, బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన అంకెలకు పొంతనలేదని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. నీటిపారుదల రంగంపై 2014 ముందువరకు రూ.1.63 లక్షల కోట్లు చేయగా, 2014 తర్వాత పదేండ్లలో రూ.1.41 లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్పారు.
శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా నీటి పారుదల ప్రాజెక్టులపై జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడారు. గత పదేండ్లలో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం తీసుకున్న అప్పుల వివరాలు చెప్పారని, అయితే గతంలో కూడా ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని.. అప్పట్లో ప్రభుత్వం అప్పులు తీసుకున్నదా.. లేదా? అనే విషయం శ్వేతపత్రంలో పేర్కొనలేదని తెలిపారు. కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణం తర్వాత కృష్ణా జలాలు భారీగా తగ్గిపోయాయని, రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులు ఉన్నా నీరు లేవనే వార్తలు వస్తున్నాయని చెప్పారు.
కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టడం మంచిదే అయినా నిర్మించిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకు సరిపడా నీటి లభ్యత ఉన్నదా? అని ప్రశ్నించారు. నీటి లభ్యత ఉండడమే కాకుండా వాటిని పారించేందుకు అవసరమైన విద్యుత్ కూడా చాలా అవసరమని, ఇంత ఖర్చు చేస్తే ఎంత భూమికి సాగునీరు అందించ్చవచ్చనే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, పెద్దలను వదిలి చిన్నచిన్న ఉద్యోగులపై చర్చలతో సరిపెట్టవద్దని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై సమగ్రంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని అక్బరుద్దీన్ కోరారు.
త్వరలో అఖిలపక్ష సమావేశం: మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పిన అంశాలపై మంత్రి స్పందిస్తూ, కృష్ణాపై ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం 299 టీఎంసీలు కాగా, పనులు కొనసాగుతున్న ప్రాజెక్టుల సామర్థ్యం మరో 225 టీఎంసీలు ఉందని చెప్పారు.
నదీపరివాహక ప్రాంతం 68 శాతం మన రాష్ట్రంలో ఉండగా, న్యాయంగా రాష్ర్టానికి 550 టీఎంసీలు రావాల్సి ఉందన్నారు. గ్రావిటీతో నీరు పారే ప్రాజెక్టుల వల్ల నష్టంలేదని, అసాధారణంగా కరెంటు వినియోగమయ్యే భారీ లిఫ్ట్ ఇరిగేషన్తోనే నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
మైనర్ ఇరిగేషన్పై దృష్టి పెట్టాలి: కూనంనేని
చెరువులు, చిన్న చిన్న లిఫ్ట్ల ద్వారా జరిగే మైనర్ ఇరిగేషన్పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని సీపీఐ పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు సూచించారు. తక్కువ ఖర్చుతో కూడుకున్న మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.
పెద్ద ఎత్తున బోరుబావుల ఆధారిత సాగు చేస్తున్నందున భూగర్భజలాలు సరిగ్గా మెయింటెయిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న, మధ్యతరహా ప్రాజక్టులతో తక్కువ భారం ఉంటుందని, తద్వారా భూగర్భజలాలు కూడా లభ్యతగా ఉంటాయని చెప్పారు. పోడుభూముల పట్టాలు ఇచ్చినప్పటికీ బోర్లు వేయడానికి అటవీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు. రాష్ర్టానికి సమగ్ర వాటర్ ప్లాన్ను రూపొందించాలని కూనంనేని సూచించారు.
గతంలో ఇరిగేషన్ బాండ్లతో రుణాలు: కడియం
గత ప్రభుత్వాలు అప్పులు చేశాయా.. లేదా? అనే విషయం శ్వేతపత్రంలో పేర్కొనలేదని అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొనడంతో, బీఆర్ఎస్ సభ్యుడు కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటూ గతంలో కూడా ప్రభుత్వం ఇరిగేషన్ బాండ్లను జారీచేసి నిధులను సమకూర్చుకున్నట్టు చెప్పారు. ఇవికూడా రుణాలేనని ఆయన పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జోక్యం చేసుకుంటూ, గతంలో ఇరిగేషన్ బాండ్లు జారీ చేసినప్పటికీ రుణాలు సేకరించేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. దీనిపై కడియం స్పందిస్తూ, ఎలా తీసుకున్నా అప్పు అప్పే అవుతుందని స్పష్టం చేశారు.