హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 2.5 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. కాంగ్రెస్ కావాలనే యూరియా కొరత అంటూ దుష్ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో ఎరువులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(ప్యాక్స్), 16,615 అధీకృత డీలర్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్యాక్స్లలో యూరియా కృత్రిమ కొరత సృష్టించి రాష్ట్రం మొత్తం అందుబాటులో లేదన్నట్టుగా కాంగ్రెస్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. నల్లగొండలో కృత్రిమ కొరతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఉద్దేశపూర్వకంగా తప్పుచేసిన ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ వానకాలం సీజన్కు 9.14 లక్షల టన్నుల యూరియా కేటాయించగా ఇప్పటి వరకు 7.78 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసినట్టు తెలిపారు. మార్చి 31 నాటికి 2.15 లక్షల టన్నుల యూరియా ముందస్తు నిల్వ చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.50 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని వివరించారు. రుతుపవనాలు ఆలస్యం కావడంతో 10 లక్షల ఎకరాల సాగువిస్తీర్ణం తగ్గిందని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులకు మరింత ఎక్కువ యూరియా అందుబాటులో ఉంచేందుకు శుక్రవారం 15,838 టన్నుల యూరియాను కొనుగోలు చేసినట్టు తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఉద్యానశాఖ సంచాలకుడు హన్మంతరావు, మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఏడీ విజయ్ కుమార్, జేడీ (ఎరువులు) రాములు తదితరులు పాల్గొన్నారు.