మహబూబ్నగర్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ శతాబ్దపు మానవాద్భుత విజయం కేసీఆర్ సాధించారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశంసించారు. ఆయన చరిత్రపుటల్లో నిలుస్తారని చెప్పారు. దేశ ప్రధాని హోదాలో జవహర్లాల్ నెహ్రూ అన్ని వనరులు చేతిలో ఉండి 1948లో భాక్రానంగల్ ప్రాజెక్టును ప్రారంభిస్తే పూర్తికావడానికి 15 ఏండ్ల సమయం పట్టిందని గుర్తుచేశారు. అది కూడా కేవలం 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేదని అన్నారు. కానీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 2015 జూన్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసి.. ‘కృష్ణమ్మ నీటితో మడిమడిని తడుపుతా.. పాలమూరు రైతన్నల కాళ్లను కడుగుతా’ అని శపథం చేసి శరవేగంగా పూర్తిచేశారని చెప్పారు. ప్రాజెక్టు కట్టనియ్యం అని చంద్రబాబు అంటే వెయ్యి చంద్రబాబులు అడ్డొచ్చినా కట్టితీరుతాం అంటూ.. నేడు పూర్తి చేసి తెలంగాణ తలెత్తుకునేలా, పాలమూరు ప్రజలు గర్వపడేలా చేశారని అన్నారు. ఇంటి దొంగలు, బయటి దొంగలతో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు దాటుకొని సాధించిన ప్రపంచ ప్రఖ్యాత ఎత్తిపోతల 4 లిఫ్టులు, 6 రిజర్వాయర్లతో పూర్తిచేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, పాలమూరు ప్రారంభించి జలకళను మన ముందుంచారని చెప్పారు. కేసీఆర్ ఇయ్యాల జిల్లాలో ఎత్తయిన ఎత్తం గట్టు ఎక్కి చూస్తే పాలమూరంతా నీళ్లు, జలశయాలే కనిపిస్తాయని తెలిపారు. నేడు పాలమూరు ఎత్తిపోతల రైతుల తలల మీద పాలుపోస్తున్నదని పేర్కొన్నారు. కృష్ణమ్మ నీళ్లను అందించిన సీఎం కేసీఆర్కు రైతులు, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.