గోపాల్పేట, నవంబర్ 14 : ఈ సారి ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే పెద్ద జీతగాడిలా పనిచేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లో మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి మంత్రి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు సాగునీళ్లు, ఉచిత కరెంట్, పంటకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తూ సేద్యాన్ని నిలబెట్టిన కేసీఆర్ సర్కార్కు అండగా నిలబడాలని కోరారు. సీఎం కేసీఆర్తోనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.
నాడు వలసలకు నిలయమైన పాలమూరు ప్రాంతానికి నేడు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు పనికోసం వచ్చే స్థాయికి చేరుకున్నట్టు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా చేతనైన సాయం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాలకు సాగు నీళ్లు అందించేందుకు 64 మినీ లిఫ్ట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.