హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజల జీవనోపాధికి వ్యవసాయరంగమే పెద్ద దిక్కని మరొకసారి రుజువైంది. 2019-20లో దేశంలో వివిధరంగాలు 53.55 కోట్ల మందికి ఉపాధి కల్పించగా, వ్యవసాయరంగం 23.27 కోట్ల మందికి ఉపాధి కల్పించిందని లోక్సభలో కేంద్రం స్వయంగా వెల్లడించింది. పలు రంగాలు కేవలం లక్షల మందికి, మరికొన్ని రంగాలు 5-6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంటే.. వ్యవసాయ, అనుబంధ రంగాలు మాత్రం ఏటా 20 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పిస్తుండటం గమనార్హం. 2017-18లో వివిధ రంగాల్లో మొత్తం 47.14 కోట్ల మందికి ఉపాధి లభిస్తే, ఇందులో వ్యవసాయరంగం నుంచే 20.03 కోట్ల ఉన్నారు. అదే విధంగా 2018-19లోనూ మొత్తం 48.76 కోట్ల మందికి ఉపాధి లభించగా, వ్యవసాయరంగం నుంచి 19.86 కోట్ల మందికి ఉపాధి లభించింది.
వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రాధాన్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు కేంద్రం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టేలా అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగునీటి కష్టాలను తొలగించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, చెరువులను బాగు పథకాలకు శ్రీకారం చుట్టారు. తద్వారా రైతులకు భరోసా కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. కేంద్రం వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే చర్యలకు పూనుకొన్నదనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా బీజేపీ సర్కారు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతుల తిరుగుబాటుతో వాటిని రద్దు చేసింది. డీజిల్ ధరలు, ఎరువుల ధరల పెంపుతో రైతులపై భారాన్ని మోపుతున్నది.
నరేంద్రమోదీ సర్కారు ఇలాగే కొనసాగితే దేశంలో వ్యవసాయం కార్పొరేట్ గుప్పిట్లోకి పోయి రైతనేవాడే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ ప్రాధాన్యం, రైతు కష్టాలు తెలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశ వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టేందుకు నడుంబిగించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ వ్యవసాయరంగం రూపురేఖలు మార్చేందుకు ఉపక్రమించారు. ‘ఆబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. దేశరైతాంగం కూడా సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తున్నది. తమకూ తెలంగాణ రైతు పథకాలు కావాలని కోరుతున్నది.