నెన్నెల, ఆగస్టు 2 : ‘తెలంగాణలో వ్యవసాయం బాగుంది. తాగు, సాగు నీరు సమృద్ధిగా ఉన్నది. రైతులు కష్టపడి ఇష్టంగా సాగు చేస్తున్నారు. మా వద్ద యంత్రాలతో సేద్యం చేస్తున్నా తగిన ఫలితం ఉండదు. చెరువులు, కుంటల కింద వ్యవసాయం చేయడం బాగుంది. గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి’ అని ఇటలీ దేశానికి చెందిన విద్యార్థులు కొనియాడారు. దేశ పర్యటనలో భాగంగా ఫెసరో టౌన్కు చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బుధవారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేద్రంలో పర్యటించారు.
‘ఇక్కడి బంధుత్వాలు, పద్ధతులు చాలా బాగున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉన్న కుటుంబాలే కనిపిస్తున్నాయి. మా దగ్గర మాత్రం తల్లి ఒక ఊరిలో తండ్రి ఒక ఊరిలో, పుట్టిన పిల్లాడు ఎక్కడో ఉంటాడు. మానవ సంబంధాలు చాలా దూరంగా ఉంటాయి’ అని విద్యార్థులు లాగ్రేస్, లూయిజీ, మత్తాయి, సెవన్, ఫాదర్, ఆసిన్, మార్టినా, షా పేర్కొన్నారు. ఇక్కడి పరిస్థితి చాలా సంతృప్తినిచ్చాయని వారు కొనియాడారు.