హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం చోదక శక్తిగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లతో పోల్చితే రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయరంగం వాటా ఏకంగా 136 శాతం పెరిగినట్టు సామాజిక, ఆర్థిక నివేదిక వెల్లడించింది. 2014-15లో వ్యవసాయరంగం వాటా రూ.41,706 కోట్లు కాగా 2022-23 నాటికి అది రూ.98,478 కోట్లకు పెరిగింది. వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 38.47 శాతం నుంచి 47.69 శాతానికి పెరిగింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాలే కారణమని ఆ నివేదిక పేర్కొన్నది.
సాగు..దిగుబడి పెరిగాయి
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి భారీగా పెరిగినట్టు సర్వే వెల్లడించింది. 2014-15లో 131 లక్షల ఎకరాలుగా ఉన్న విస్తీర్ణం 2021-22లో 198 లక్షల ఎకరాలకు పెరిగినట్టు పేర్కొన్నది. ఎనిమిదేండ్లలో 51 శాతం సాగు విస్తీర్ణం పెరిగినట్టు తెలిపింది. వరిసాగు విస్తీర్ణం 180 శాతం పెరిగిందని వెల్లడించింది. ఇక ప్రధాన పంటల ఉత్పత్తి 52 శాతం పెరిగినట్టు వెల్లడించింది. 2014-15లో 232 లక్షల టన్నుల దిగుబడి రాగా 2021-22లో 326 లక్షల టన్నులకు పెరిగిందని పేర్కొన్నది.