హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మట్టి లేకుండా వ్యవసాయం చేయవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు దర్జాగా పండించొచ్చు. వినడానికి విచిత్రంగా ఉన్నా హైడ్రోపోనిక్ అనే నూతన విధానం ద్వారా కేవలం నీటి ఆధారంగా పంటలు పండించవచ్చని నిరూపితమైంది. నగరాలు, పట్టణాలు అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో స్థలాభావం ఏర్పడుతున్నది. ఇలాంటి ప్రాంతాల్లో ఈ విధానం ద్వారా కావాల్సిన సాగు చేసుకోవచ్చు. మట్టి అవసరం లేకుండా అంతేస్థాయిలో ఖనిజ పోషకాలు ఉండే నీటితో మొక్కలను పెంచే పద్ధతిని హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటారు.
హైడ్రోపోనిక్తో అనేక లాభాలు
ఈ నూతన విధానంలో అనేక లాభాలు ఉన్నాయి. అధిక దిగుబడి సాధించడంతోపాటు సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట్ల ఈ విధానం ద్వారా పంటలు పండించొచ్చు. అంతేకాదు తక్కువ వ్యవధిలో ఎక్కువ పంట చేతికి అందడంతోపాటు సాధారణ సాగుతో పోల్చితే 20 శాతం నీటినే ఈ పంటలకు వినియోగించుకోవచ్చు. కలుపు, చీడపీడల బాధ ఉండదు. బయటి వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ తరహా విధానం ద్వారా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పూలను సాగు చేసుకొనే అవకాశం ఉన్నది. పురుగుమందులు అవసరం లేకుండా కాలుష్యరహిత పంటలు పొందే అవకాశం ఉన్నది.
సవాళ్లూ లేకపోలేదు..
హైడ్రోపోనిక్ సాగును ఇటీవల స్టార్టప్ రూపంలో ప్రారంభిస్తున్నారు. అయితే కమర్షియల్గా సక్సెస్ కావాలంటే చాలా కృషి అవసరం. పెట్టుబడి కూడా అధికంగా పెట్టాల్సి ఉంటుంది. 600 గజాల స్థలంలో పాలీహౌస్ సహా హైడ్రోపోనిక్ సాగు చేయాలంటే తొలి ఏడాది కనీసం రూ.30 లక్షలు అవసరమవుతాయని అంచనా.
సాగు విధానం ఇలా..
తొలుత సీడ్ ట్రాక్లో మట్టిలో మనకు కావాల్సిన విత్తనాలు వేసుకొని కావాల్సినంత నీరు పోయాలి. పోసిన నీటి ద్వారా సీడ్ ట్రాక్లో వారంలో విత్తనం మొక్కగా మారుతుంది.
అలా పెరిగిన మొక్కను అన్ని పరికరాల ద్వారా తయారు చేసుకొన్న హైడ్రోపోనిక్ పైపుల మధ్య జాలీప్లాస్టిక్ కప్పులలో క్లేబాల్స్ (మట్టిరాళ్లు) వేసి మధ్యలో పెట్టాలి. కింద ఒక బకెట్లో నిండా నీరు పోసి, నీటిని పంపించే మోటరును పైపులకు అనుసంధానం చేయాలి.
మొక్కలకు అవసరమైన సూక్ష్మ, స్థూల పోషకాలను నిపుణుల సిఫార్సు మేరకు వేయాలి. ద్రావణం మోతాదులను ప్రత్యేక పరికరాల ద్వారా పరిరక్షించుకోవాలి. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 వరకు ఉండాలి. ఎలక్ట్రికల్ కండక్టివిటీ 1500 పీపీఎం కంటే తక్కువ ఉండాలి. వీటికి సూర్యరశ్మి తగులకుండా శుభ్రమైన స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి.
పీవీసీ పైపుల మధ్యభాగంలో జాలీ కప్పులలో ఉంచి మొక్కలకు మోటరు ద్వారా నిరంతరం నీటిని అందించాలి. మొక్కలకు రోజుకు 2 గంటలపాటు ఎండ తగిలేలా చూడాలి. మొక్కలు తక్కువ సమయంలో ఎదిగి తాజా ఆకుకూరలు, కాయగూరలు పండుతాయి. కనీసం 2-3 సార్లు పంట చేతికి వస్తుంది. హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా అరమీటరు పొడవు పెరిగే అన్నిరకాల ఆకుకూరలు, కూరగాయలను ఇంట్లోనే పండించుకోవచ్చు.