High Court | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఒకరికి సంబంధించిన భూమిని మరొకరు తీసుకుంటే భూ యజమానికి ముందుగా సమాచారం ఇవ్వాలి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లాగేసుకుంటే అది దాదాగిరి, దౌర్జన్యం అవుతుంది. వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీలకు సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం అదే పని చేసింది. రాజేంద్రనగర్లో ఈ రెండు యూనివర్సిటీలకు చెందిన స్థలాన్ని చెప్పాపెట్టకుండా ప్రభుత్వం లాగేసుకున్నది. 100 ఎకరాల స్థలాన్ని నూతన హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే ఆ స్థలాన్ని తీసుకుంటున్నట్టు యూనివర్సిటీలకు కనీస సమాచారం ఇవ్వలేదు. పోనీ తీసుకున్న తర్వాతైనా వారికి సమాచారం ఇచ్చారా అంటే అదీ లేదు.
భూమి బదలాయిస్తూ డిసెంబర్ 31న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులిచ్చి వారం రోజులు గడిచినా యూనివర్సిటీలకు అధికారికంగా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. సదరు భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. అప్పుడు గానీ యూనివర్సిటీ అధికారులకు ఈ విషయం తెలియలేదు. సమాచారం ఇవ్వకుండా భూమిని తీసుకోవడంపై ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత అధికారం ఉంటే మాత్రం.. ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా శాస్త్ర పరిశోధనలు చేసే సంస్థల నుంచి తమ అవసరాలకు భూమి తీసుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ భూమిని చూపించిన తర్వాతే ముందడుగు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇది జరగలేదు. హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు కేటాయించగా, ఇందులో ఉద్యాన యూనివర్సిటీకి చెందిన 57.5 ఎకరాలు, వ్యవసాయ వర్సిటీ భూమి 42.5 ఎకరాలు ఉన్నది. ఆ భూమికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం లేదు. దీనిపై ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి చర్చ పెట్టలేదు. ఉత్తర్వుల్లో కూడా పేర్కొనలేదు. యూనివర్సిటీలు భూమితోపాటు అందులోని కట్టడాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యాన యూనివర్సిటీకి 57.5 ఎకరాల్లో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టడాలున్నాయి. ఇందులో పలు ఆఫీస్ కార్యకలాపాలతోపాటు ఇతర కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ఇంజినీరింగ్ యూనివర్సిటీలకు భవనాలు ముఖ్యమైతే వ్యవసాయ సంబంధ వర్సిటీలకు పరిశోధనల కోసం విస్తారమైన భూమి అవసరం. అందుకే ప్రైవేటు రంగంలో వ్యవసాయ వర్సిటీలు ఎక్కువగా ఉండవు. వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలకు భూమి లేకుంటే పరిశోధనలు సాధ్యం కాదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించని పక్షంలో పరిశోధనలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనలు, వ్యవసాయ విద్య కుంటుపడటం ఖాయమని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వీటి ప్రభావం చివరికి వ్యవసాయంపై, రైతులపై పడుతుందని అంటున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ఉన్న ప్రవీణ్రావు పదవీ విరమణ చేయడంతో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు వీసీగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్రావు పదవీ విరమణ చేసి సుమారు ఏడాదిన్నర అవుతున్నది. ఇప్పటికీ ఆ స్థానంలో రెగ్యులర్ వీసీని ప్రభుత్వం నియమించలేదు. ఒకవేళ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రొఫెసర్లు, విద్యార్థులు అంటున్నారు. వైఎస్ హయాంలో భూములను తీసుకునేందుకు ప్రయత్నిస్తే అప్పటి వీసీ రఘువర్ధన్రెడ్డి అడ్డుకున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం కార్యదర్శి రఘునందన్రావు ప్రభుత్వంలో భాగమే కాబట్టి.. ప్రభుత్వం చెప్పినట్టు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని యూనివర్సిటీ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
వ్యవసాయ వర్సిటీల భూములకు సంబంధించి ఎప్పటి నుంచో సర్కారు కన్ను ఉన్నది. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్ కోసం యూనివర్సిటీల భూమిని తీసుకోవాలని ఆయన ప్రయత్నించారు. దీనిపై అప్పట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు వైఎస్ వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితిని వివరించారు. ఆ భూమి అవసరాన్ని, భూమి లేకుంటే జరిగే నష్టాన్ని, అక్కడ జరుగుతున్న పరిశోధనలు, పెంచుతున్న వృక్ష జాతులకు సంబంధించి క్షుణ్ణంగా తెలిపారు. దీంతో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఏకపక్షంగా యూనివర్సిటీ భూములను అప్పనంగా అప్పగించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.