వైద్యశాలకు గర్భిణి విజయ తరలింపు.. ఆడ శిశువు జననం
ఏజెన్సీల్లో గర్భిణులను దవాఖానలకు తీసుకెళ్తున్న వైద్య సిబ్బంది
నమస్తే తెలంగాణ, నెట్వర్క్: భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులను అధికార యంత్రాంగం సమీప దవాఖానలకు తరలిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన గర్భిణి కామెర విజయను పోలీసులు, వైద్య సిబ్బంది అతికష్టంగా దవాఖానకు తరలించారు. విజయ కాన్పుకోసం తల్లిగారి ఊరైన మొట్లగూడకు వెళ్లింది. ఆమెకు 15న డెలివరీ చేయాల్సి ఉన్నది. భారీవర్షాల నేపథ్యంలో మంగళవారం ఏఎన్ఎం సత్యవాణి ఆటోలో విజయను తరలిస్తుండగా రాంపూర్-ఖర్జీ అడవిలో చెట్లు కూలి రోడ్డుపై పడిపోయాయి. ఏఎన్ఎం ఇచ్చిన సమాచారంతో సీఐ నాగరాజు, ఎస్ఐ సనత్ వచ్చి అటవీ సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో తొలగించారు. తర్వాత బురదలో ఆటో కదల్లేకపోవటంతో అవతలి వైపు నుంచి మరో ఆటోను రప్పించి గిరివెల్లి వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పీహెచ్కి తరలిస్తుండగా ఒడ్డుగూడెం వద్ద రోడ్డుపై నీళ్లుచేరి రాకపోకలు నిలిచిపోయాయి.
కొంచవెల్లి మీదుగా తరలించేందుకు ప్రయత్నించగా రొడ్యాంవాగు పొంగటంతో స్ట్రెచర్పై దాటించారు. అవతల వైపు నిలిపిన 108 అంబులెన్స్లో దహెగాం పీహెచ్సీకి తరలించి ప్రసవం చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రైతుబంధు మండల కన్వీనర్ కంబగౌని సంతోష్గౌడ్, వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్ తదితరులు దవాఖానకు చేర్చే సహాయంగా ఉన్నారు. మరోఘటనలో మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం-వేమనపల్లి మధ్య వాగు ఉప్పొంగడంతో గర్భిణులైన సుంపుటం గ్రామానికి చెందిన కేడ్వాయి మంజుల, కల్లెంపల్లికి చెందిన సిడం రజిత, జాజులపేటకి చెందిన జాడి అశ్వినిని.. నాటు పడవలో సర్పంచు కొండగొర్ల బాపు, పంచాయతీ కార్యదర్శి సిరాజ్, సుదర్శన్ దాటించారు.
అనంతరం ఎంపీడీవో లక్ష్మయ్య కారులో వేమనపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మసిరికొండ మండలం మల్లాపూర్ పంచాయతీ పరిధిలోని ధర్మసాగర్ గ్రామానికి చెందిన ఎస్ రేణుకాబాయి(22)కి పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్లో దవాఖానకు తీసుకెళ్తుండగా మల్లాపూర్ వాగు ఉప్పొంగింది. 108 సిబ్బంది, గ్రామస్థులు కలిసి తాడుసాయంతో గర్భిణిని వాగు దాటించి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డకు చెందిన చెన్నూరి రజితకు పురిటినొప్పులు రావటంతో దవాఖానకు తీసుకెళ్తుండగా పెద్దంపేట వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం వాగు దాటించి సురారం వరకు చేరవేయగా అకడి నుంచి భూపాలపల్లి దవాఖానకు తరలించారు.