హోంశాఖ మినహా అన్ని శాఖలకు వర్తింపు
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్, మార్చి 9 : ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నప్పటికీ వయస్సు దాటిపోయిందని బాధపడేవారికి రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించడం, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ జాప్యం కావడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. దీనిపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 44 ఏండ్ల వయసున్నవారు సైతం ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులవుతారు.
సామాజికవర్గాలు/క్యాటగిరీలవారీగా చూస్తే.. ఓసీ అభ్యర్థులు 1978 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 1973 తర్వాత, దివ్యాంగ అభ్యర్థులైతే 1968 తర్వాత, మాజీ సైనికోద్యోగులైతే 1975 తర్వాత జన్మించి ఉండాలి. ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యే తేదీని ఆధారంగా చేసుకొని కటాఫ్ను నిర్ణయిస్తారు. దానిని బట్టి గరిష్ఠ వయోపరిమితిని నిర్ణయిస్తారు. ఇది హోంశాఖ మినహా మిగిలిన అన్ని శాఖల్లోని ఉద్యోగాలకు వర్తిస్తుంది. పోలీస్ విభాగంలో చేరాలనుకొనేవారు శారీరక సామ ర్థ్య పరీక్షను అధిగమించాల్సి ఉన్నందున వయోపరిమితి పెంపునకు అవకాశం ఉండదు.