Haritha Haram | తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మానసపుత్రికగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకుంటున్నది. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 273.33 కోట్ల మొక్కలను నాటారు. 19 వేల ఆవాసాలు, గ్రామపంచాయతీల్లో పార్కులను ఏర్పాటు చేశారు. పల్లెలు, పట్టణాల్లో ప్రకృతి వనాలు, పార్కులు ఏర్పాటుతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. యాదాద్రి మాడల్ ప్లాంటేషన్ హరితహారంలో ఒక అద్భుతం. పట్టణాల స్థానికసంస్థల బడ్జెట్లో కనీసం10 శాతం కచ్చితంగా హరితహారం, మొక్కల పెంపకం, సంరక్షణ, నర్సరీలు తదితర వాటి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో గ్రీన్కవర్ 18 శాతం నుంచి 31.6 శాతానికి పెరిగింది. 2015లో తెలంగాణలో గ్రీన్కవర్ 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2021 నాటికి అది 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పచ్చదనం పెంపులో హైదరాబాద్కు గ్రీన్సిటీ అవార్డు దక్కింది. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అవార్డునూ హైదరాబాద్ దక్కించుకున్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్)ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత్ నుంచి ఈ పురస్కారం అందుకొన్న ఒకే ఒక్క సిటీ హైదరాబాద్. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అటవీశాఖతోపాటు వివిధ శాఖలు దాదాపు రూ.10,822.46 కోట్లు ఖర్చు చేశాయి. హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవటానికి హరితనిధిని ఏర్పాటు చేశారు.