Narsampet | ఐదేండ్లు.. కేవలం ఐదేండ్లలో అరవై ఏండ్ల వెనుకబాటును రూపుమాపవచ్చని.. అభివృద్ధి బాట పట్టించవచ్చని నిరూపించారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి. అన్ని వనరులు ఉన్నా గత పాలకుల అలసత్వం కారణంగా అభివృద్ధికి నోచుకోని నర్సంపేటకు కొత్త కాంతులను తీసుకువచ్చారు. సర్కారు విద్య, వైద్యాన్ని ఇక్కడి ప్రజలకు చేరువ చేశారు. కలలో కూడా సాధ్యం కాదనుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయించారు. ఆయన కృషి ఫలితంగానే పాకాల చెరువుకు గోదావరి జలాలు వచ్చాయి. రెండు పంటలకు సాగునీరు అందుతున్నది.
నర్సంపేట నియోజకవర్గంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి మూడుసార్లు, దొంతి మాధవరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న ఈ ఇద్దరు నేతలు కలిసి నర్సంపేటను ఇరవై ఏండ్లు పాలించారు. ఐదేండ్ల కింద పెద్ది సుదర్శన్రెడ్డి ఎమ్మెల్యే అయ్యే వరకు ఈ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండేది. ఆ పాపంలో ఈ ఇద్దరు నేతలదే ప్రధాన పాత్ర. తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి 2018 ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి మొదలైంది. గత ఎమ్మెల్యేలు అనేక హామీలు ఇచ్చి గెలిచాక మరిచిపోయారు. వీరు ఇచ్చిన హామీలను కూడా పెద్ది నెరవేర్చి చూపించారు. ఈ ఐదేండ్ల కాలంలో నియోజకవర్గం పురోగతి సాధించింది. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గానికి నిధుల వరద పారించారు. దీంతో నర్సంపేట అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. జిల్లా కేంద్రం కాకపోయినా జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలను నర్సంపేటకు కల్పించడంలో సుదర్శన్రెడ్డి సఫలమయ్యారు.
ఐదేండ్ల కింది వరకు నర్సంపేటలో సాగునీటి కొరతతో రైతన్నలు అనేక ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాల్వలకు నీరు రాక పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. పెద్ది సుదర్శన్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక మరమ్మతులు చేయించారు.
అడ్డంకులను తొలగించి కాల్వల్లో నీరు పారేలా, సాగునీటి కొరత తీరేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కాల్వలకు జలకళ ఉట్టిపడుతున్నది. రామప్ప పాకాల చెరువు, రామప్ప రంగాయ చెరువుకు జలవనరులను తెస్తామని ప్రతి ఎమ్మెల్యే హామీ ఇచ్చి చేతులెత్తేశారు. పెద్ది సుదర్శన్రెడ్డి మాత్రం ఈ హామీని సుసాధ్యం చేసి చూపించారు. రూ.590 కోట్లతో పనులు చేపట్టి గోదావరి నీటితో ఈ చెరువులకు శాశ్వత జలాలను తీసుకొచ్చారు. దీంతో ఈ చెరువుల కింద ఆయకట్టుకు ఇప్పుడు రెండు పంటలకు సరిపడా నీరు అందుతున్నది. అవసరమైన చెక్డ్యాంలు, వంతెనలు నిర్మించారు. ఇరిగేషన్ సర్క్యూట్ను ఏర్పాటు చేయించారు. రూ.12 కోట్లతో రైతులకు సబ్సిడీపై విద్యుత్ మోటర్లను అందించారు. రూ.66 కోట్లతో మిషన్ కాకతీయ పథకం కింద 270 చెరువులను బాగుచేయించారు.
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో తెల్లకోటు విప్లవానికి నాంది పలికింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వరంగల్ జిల్లాకు నర్సంపేట కేంద్రం కాకపోయినప్పటికీ ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు అవసరాన్ని పెద్ది సుదర్శన్రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ.182 కోట్లతో మంజూరు చేయించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా రూ.66 కోట్లతో జిల్లా ప్రభుత్వ దవాఖాన ఏర్పాటుకు కృషి చేశారు.
దవాఖానను 450 పడకలుగా అప్గ్రేడ్ చేయించడంతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్, బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయించారు. రూ.12 కోట్లతో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో 49 పల్లె దవాఖానలను నెలకొల్పారు. విద్యారంగంలోనూ విశేషంగా అభివృద్ధి చెందింది. ఇక్కడికి హార్టికల్చర్ రిసెర్చ్ సెంటర్, సైనిక్ స్కూల్ను మంజూరు చేయించారు. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల,కళాశాల, గురుకుల కళాశాల, స్కూల్, మైనారిటీ బాలికల కళాశాల, గురుకుల హైస్కూల్, ఎస్సీ, ఎస్టీ గురుకులాలను తీసుకువచ్చారు.
☞ ₹ 350 కోట్లతో జాతీయ రహదారుల కనెక్టివిటీ రోడ్లు, రూ.53 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు, దాదాపు రూ.80 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లు, రూ.65 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లను మంజూరు చేయించారు.
☞ రాష్ట్రంలోనే మొదటిసారిగా నర్సంపేటలో 12,600 ఇండ్లకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా ₹ 80 కోట్లతో లక్ష మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణం.
☞ 29 రైతు వేదికలు నిర్మించారు. సబ్సిడీపై 600 ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
☞ 50 వేల మంది రైతులకు రూ.37.50 కోట్లతో సబ్సిడీపై యంత్రాలను అందించారు.
☞ రూ.16 కోట్లతో దళితులకు సబ్సిడీపై పాడి గేదెల పంపిణీ చేపట్టారు.
☞ ₹ 50 కోట్లతో నర్సంపేట పట్టణంలో మౌలిక వసతులు కల్పించారు.
☞ ఐదువేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, మిషిన్లు అందిస్తున్నారు.
☞ 610 మంది మత్స్యకారులకు 610 ద్విచక్రవాహనాల పంపిణీ
☞ ₹ 15 కోట్లతో 33 కుల సంఘాలకు భవనాల నిర్మాణం.
☞ 61 హ్యాబిటేషన్లలో 8,334 మందికి పోడు పట్టాల పంపిణీ.