అపార వనరులు ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం చెన్నూర్. కాంగ్రెస్ పాలకులు అభివృద్ధికి దూరం చేశారు. ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకొని గడ్డం సోదరులు వినోద్, వివేక్ రాజకీయంగా ఎదిగారు కానీ, ప్రజల సమస్యలు విస్మరించారు. ఎమ్మెల్యేగా గెలిచిన వినోద్ మంత్రి అయ్యారు. వివేక్ ఎంపీగా గెలిచారు. పదేండ్ల పాటు ప్రజాప్రతినిధులుగా ఉండి చెన్నూర్ను బాగు చేద్దామని ప్రయత్నించలేదు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చెన్నూర్కు కొత్త వెలుగులు వచ్చాయి. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలిచాక నిధుల వరద పారింది. ప్రగతి పనులన్నీ చకచకా చేస్తున్నారు. దశాబ్దాల నాటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు. గోదావరి, ప్రాణహిత నదులపై కోటపల్లి, చెన్నూర్, జైపూర్ మండలాల్లో ఎత్తిపోతల నిర్మించి కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా లక్ష ఎకరాలకుపైగా సాగునీరు అందుతున్నది. ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా మారింది.
Chennur | 2004లో గడ్డం వినోద్ చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేండ్ల పాటు కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 2009లో పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ ఎంపీగా గెలిచారు. చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది. ఇలా పదేండ్ల పాటు గడ్డం సోదరులు చెన్నూర్కు ప్రజాప్రతినిధులుగా కొనసాగారు. వీరి హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధికి దూరమయ్యింది. కనీస మౌలిక సదుపాయాలకు కూడా ఇక్కడి ప్రజలు నోచుకోలేదు. గ్రామాలకు సరైన రోడ్లు ఉండేవి కాదు. వంతెనలు లేక వాగుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించాల్సి వచ్చేది. సర్కారు వైద్యం అందుబాటులో లేక ఎందరో ప్రాణాలు కోల్పోయారు.
గడ్డం సోదరులు అభివృద్ధిని విస్మరించారని గుర్తించిన చెన్నూర్ ప్రజలు వాళ్లను వరుసగా ఓడిస్తూ బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారు. తమ బాగు కోరేది బీఆర్ఎస్ మాత్రమేనని ఇక్కడి ప్రజలు నమ్మారు. 2014లో కేసీఆర్ సర్కార్ వచ్చాక ప్రజల నమ్మకం నిజమయ్యింది. చెన్నూర్లో మార్పు మొదలయ్యింది. దశాబ్దాల నుంచి డిమాండ్లుగానే ఉండిపోయి, ఎన్ని ధర్నాలు చేసినా అందని ద్రాక్షగానే మిగిలిపోయిన చెన్నూర్ రెవెన్యూ డివిజన్, చెన్నూర్ బస్డిపో కలలు సాకారమయ్యాయి. పారుపల్లి, అస్నాద్ కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయి. రోగమో, నొప్పో వస్తే మంచిర్యాల, పొరుగు మహారాష్ట్రకు పోవాల్సిన అవసరం లేకుండా చెన్నూర్లో రూ.40 కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.12 కోట్లతో నిర్మించుకున్న 50 పడకల మాతాశిశు దవాఖానను ప్రారంభించారు.
2018 ఎన్నికల్లో చెన్నూర్ ఎమ్మెల్యేగా బాల్క సుమన్ గెలిచాక అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో ఆయన విజయం సాధించారు. మందమర్రిలో 70 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. 250 ఎకరాల్లో రూ.50 కోట్లతో అద్భుతమైన కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు పనులు మొదలుకానున్నాయి. చెన్నూర్ పట్టణంలో సెం ట్రల్ లైటింగ్, కేసీఆర్ పార్క్ను అభివృద్ధి చేశారు. మండల కేంద్రా ల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటయ్యింది. ఎన్నో యేండ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. వాగులు, వంకలపై 18 బ్రిడ్జిలు నిర్మించారు. మరికొన్ని బ్రిడ్జి కమ్ చెక్డ్యాంలు మంజూరై ఉన్నాయి. రూ.1,650 కోట్ల చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి, ప్రాణహిత నదులపై కోటపల్లి, చెన్నూర్, జైపూర్ మండలాల్లో ఎత్తిపోతలను నిర్మించి కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించనున్నారు.